భారత్ అభిమానులే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియాలో దుర్భాషలాడారని మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. 2012లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవం ఎదురైందని చెప్పాడు. 2017 నుంచి పోటీక్రికెట్కు దూరమైన ప్రవీణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
''ఎవరితో నేను గొడవ పడలేదు. నేను, రోహిత్ శర్మ, మనోజ్ ముగ్గురం నెట్స్లో ఉన్నాం. అది మెల్బోర్న్అనుకుంటా. మనవాళ్లే మాతో దుర్భాషలాడారు. రోహిత్ శర్మను భారత్ అభిమానులే తిట్టారు. చాలాసేపు ఓపికగా ఉన్న రోహిత్ తర్వాత సహనం నశించి రియాక్ట్ అయ్యాడు. అతడికి మద్దుతగా నేను నిలిచాను. అయితే మన వాళ్లే మనల్ని అవమానించడం దారుణం'' అని ప్రవీణ్ అన్నాడు.

బాల్ టాంపరింగ్ గురించి ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ''అందరూ బాల్ టాంపరింగ్ చేస్తారు. కానీ పాకిస్థాన్ బౌలర్లు కొంచెం ఎక్కువగా చేస్తారని విన్నాను. అయితే ఇప్పుడు ప్రతి చోట కెమెరాలు ఉన్నాయి. కానీ గతంలో అలా లేదు. ప్రతిఒక్కరూ చేసేవారు. అయితే బంతిని స్క్రాచ్ చేసి ఎవరికైనా ఇస్తే.. దాన్ని ఉపయోగించి రివర్స్ స్వింగ్ చేసే సత్తా కూడా అవతలివాళ్లకి ఉండాలి'' అని అన్నాడు.
ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి-గౌతమ్ గంభీర్ గొడవ గురించి అడగ్గా ప్రవీణ్ ఇలా బదులిచ్చాడు. ''విరాట్ కోహ్లి గొప్ప వ్యక్తి. పరుగులు ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. అందుకే అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. మంచి డైట్తో శరీరాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. కోహ్లి నాకు తమ్ముడు లాంటివాడు. గంభీర్ నాకంటే పెద్దవాడు. అన్నయ్య లాంటివాడు. తమ్ముడిని అన్నయ్య తిట్టడంలో తప్పులేదు. గంభీర్ పెద్దవాడు. కోహ్లిని తిట్టవచ్చు'' అని ప్రవీణ్ పేర్కొన్నాడు.
గత ఐపీఎల్ సీజన్లో కోహ్లి, గంభీర్ మధ్య గొడవైన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం వాగ్వాదం జరిగింది. కాగా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సన్నద్ధమవుతున్నారు. మొహాలి వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. వ్యక్తిగత కారణాలతో కోహ్లి మొదటి టీ20కి అందుబాటులో ఉండట్లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తన కూతురు వామిక పుట్టినరోజు కోసం కోహ్లికి జట్టుకు దూరమయ్యాడని నెట్టింట్లో చర్చ సాగుతోంది. కాగా, దాదాపు 14 నెలల తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.