
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 15 రోజుల సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని ఏం చేస్తున్నాడంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో లేహ్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నాడు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోనికి అతడి భార్య సాక్షితో పాటు కుమార్తె జీవా ఘన స్వాగతం పలికారు. అనంతరం ధోని ఢిల్లీ నుంచి నేరుగా జార్ఖండ్కు వెళ్లకుండా కమర్షియల్ యాడ్స్ షూట్స్లో భాగంగా కుటుంబంతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ధోని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ స్పష్టం చేశాడు,
ముంబైలోని గ్రీన్ వ్యాలీ స్టూడియోలో ధోనిపై రూపొందించిన యాడ్ షూట్కు సంబంధించిన ఫోటోని మిహిర్ దివాకర్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోకు "వింటర్ క్యాంపెయిన్ 2019 - ఇండియన్ టెర్రిన్ షూట్" అంటూ కామెంట్ సైతం పోస్టు చేశాడు. ఈ యాడ్ షూట్ పూర్తైన తర్వాత ధోని మంగళవారం మరో యాడ్ షూట్లో పాల్గొన్నాడు.
మోహబాబూ స్టూడియోస్లో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవనానీతో కలిసి ధోని మరో యాడ్ షూట్లో సందడి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రెండు నెలలు విరామం ప్రకటించి 106 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన పారా బెటాలియన్తో కలిసి విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్లో శిక్షణ తీసుకోవడంతో పాటు అక్కడ గార్డ్ విధుల్లో ధోని పాల్గొన్నాడు. సుమారు రెండు వారాల పాటు కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. ఇందులో భాగంగా విక్టర్ ఫోర్స్లో ధోని పనిచేశాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో సైతం పాల్గొన్నాడు.
సైనికులతో కలసి వాలీబాల్ కూడా ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ పంచుకున్నాడు. లేహ్ నగరంలోని ఓ బాస్కెట్ బాల్ కోర్టును క్రికెట్ ఫీల్డ్ గా మార్చి అక్కడి పిల్లలతో కలసి ధోనీ క్రికెట్ ఆడిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ధోని విధుల్లో ఉన్నప్పుడు యురి, అనంతనాగ్లను సైతం సందర్శించాడు.