ఐపీఎల్-2024లో కీలక సమరానికి వేళైంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ను తలపడనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయిర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. బలాబలాలతో పోలిస్తే సమవుజ్జీలుగా ఇరు జట్లు కనిపిస్తుండటంతో ఇవాళ మ్యాచ్పై అంచనాలు భారీగా పెరిగాయి.
సుమారు రెండు వారాల క్రితం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచిన ఆర్సీబీ, ఆ తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. అదే జోరులో రేపటి మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్పై నెగ్గి క్వాలిఫయిర్-2కు చేరుకోవాలని కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ గత అయిదు మ్యాచ్ల్లోనూ గెలుపు రుచి చూడలేకపోయింది. అయితే ప్లేఆఫ్స్లో సరికొత్త ఉత్సాహంతో ఆడి ఆర్సీబీని ఓడించాలని ఆర్ఆర్ ప్రణాళికలు రచిస్తోంది.

ఇవాళ మ్యాచ్కు వరుణుడి ముప్పులేదు. మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగినా సమస్యేమి లేదు. ప్లేఆఫ్స్ మ్యాచ్ల ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయించారు. అంటే రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైనా 20 ఓవర్లు పాటు మ్యాచ్ను నిర్వహిస్తారు. అప్పటికీ మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే పూర్తి మ్యాచ్ ఆడిస్తారు.
అయితే రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించలేని పరిస్థితి వస్తే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అంటే నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీకి బదులుగా మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ను క్వాలిఫయిర్-2కు క్వాలిఫై చేస్తారు. కాగా, ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆర్ఆర్ తొమ్మిది మ్యాచ్లు ఆడగా, నాలుగింట్లో విజయాలు సాధించింది. మరోవైపు బెంగళూరు 14 మ్యాచ్ల్లో అయిదింట్లో గెలిచింది.
తుది జట్టు అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మాక్స్వెల్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్: స్వప్నిల్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, టామ్ కొహ్లెర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్: రొవ్మన్ పావెల్.