క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 సీజన్ వచ్చేసింది. కొత్త సారథుల నాయకత్వంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచులోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఓపెనింగ్ మ్యాచ్ లో పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రారంభ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని అంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దాదాపు 70 శాతం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రాక్టీస్ మ్యాచ్ కు అంతరాయం..
దీంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా సిద్ధమైన అభిమానులకు వరుణుడు ఆందోళన కలిగిస్తున్నాడు. ఇప్పటికే మ్యాచ్ ముందు రోజు కూడా కోల్కతా, ఆర్సీబీ ప్లేయర్స్ ప్రాక్టీస్ మ్యాచ్ కు వర్షం వల్ల అంతరాయం కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇప్పుడు కూడా మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి?
వాతావరణ శాఖ అంచనా ప్రకారం వర్షం పడితే మ్యాచ్ రద్దు అవుతుంది. అప్పుడు కేకేఆర్, ఆర్సీబీ జట్లకు చెరో పాయింట్ను కేటాయిస్తారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. ఇకపోతే ఈ మ్యాచ్ రద్దైతే ఏ జట్టుకు లాభమో, ఏ జట్టుకు నష్టమో చెప్పడం కష్టం. ఏదీ ఏమైనా ప్రస్తుతం మ్యాచ్ సజావుగా సాగాలని ప్రతీ క్రీడాభిమాని కోరుకుంటున్నారు.
