లార్డ్స్లో టెస్టు మ్యాచ్ అంటే ఎంతో ప్రత్యేకం
క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్లో టెస్టు మ్యాచ్ అంటే ప్రతి జట్టుకు ఎంతో ప్రత్యేకం. ఇప్పటివరకు టీమిండియా సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విజయాలను సాధించారు. భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్ ఇప్పటి వరకు లార్డ్స్లో విజయాలు నమోదు చేసుకుంది. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ లార్డ్స్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఐదు వికెట్ల తేడాతో విజయం
ఈ మ్యాచ్లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రెండో సారి లార్డ్స్లో అద్భుత విజయాన్ని అందుకుంది. కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ధోని నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.
ధోని అరుదైన రికార్డు
ఇక, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రహానే, ఇషాంత్ శర్మ చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 1986 తర్వాత లార్డ్స్లో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్గా ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రహానే సెంచరీ నమోదు చేయడంతో టీమిండియా 295 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసి కుప్పకూలింది.
ఇప్పుడు కోహ్లీ వంతు
ఇక, రెండో ఇన్నింగ్స్లో మురళీ విజయ్ (95), జడేజా(68), భువీ(52) పరుగులతో రాణించడంతో 342 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్ ఇషాంత్ శర్మ 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లార్డ్స్లో భారత్-ఇంగ్లాండ్ గణాంకాలు:
* కోహ్లీ నాయకత్వంలో 36 టెస్టులు ఆడిన భారత్ ఒక్కసారి కూడా ఒకే తుది జట్టుతో వరుసగా రెండు మ్యాచ్లు ఆడలేదు.
* లార్డ్స్లో భారత్ 17 మ్యాచ్లు ఆడి రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా చేసుకుని.. పదకొండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు 2011 నుంచి లార్డ్స్లో ఆడిన 21 మ్యాచ్ల్లో 11 మాత్రమే గెలిచింది.
* లార్డ్స్లో ఆడిన 25 టెస్టుల్లో కుక్ చేసిన పరుగులు 1916. ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో అతడు రెండో స్థానంలో ఉన్నాడు.
* ఇంగ్లాండ్ లార్డ్స్లో చివరిసారి 2011లో ఓ ఆసియా ప్రత్యర్థిపై గెలిచింది. అది భారత్పైనే. ఆ తర్వాత అక్కడ ఆసియా జట్ల చేతిలో మూడు టెస్టులు ఓడిన ఇంగ్లాండ్.. రెండు టెస్టులు డ్రా చేసుకుంది.
* ప్రస్తుత భారత జట్టులో ఒక్క రహానే మాత్రమే లార్డ్స్ మైదానంలో సెంచరీ (2014లో) సాధించాడు.
* లార్డ్స్లో మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అండర్సన్ 22 మ్యాచ్ల్లో 94 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్ 20 మ్యాచ్ల్లో 78 వికెట్లు తీసుకున్నాడు.