స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన 13 ఏళ్ల క్రికెట్ కెరీర్లో తొలి సారి టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మైదానంలో దేశం కోసం యుద్ధాన్ని తలపించేలా పోరాడే కోహ్లి ఇంగ్లండ్ సిరీస్కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోహ్లి గాయపడి మ్యాచ్లకు దూరమైన సందర్భాలు కూడా తన కెరీర్లో లేవు. నామమాత్రపు మ్యాచ్ల్లో ఇతరులకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తప్ప అతడు బెంచ్కు కూడా పరిమితం కాలేదు.
అంతేగాక కోహ్లి క్రికెటర్గా మారడంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు క్రీడా ప్రపంచానికే స్ఫూర్తినింపేవి. తన 17 ఏళ్ల వయస్సులో తండ్రి ప్రేమ్ కోహ్లి మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని కూడా మైదానంలో గొప్పగా పోరాడాడు. 2006 డిసెంబర్ 18వ తేదీన.. 90 పరుగులు చేసి జట్టును కాపాడిన తర్వాత.. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. క్రికెట్పై కోహ్లికి ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం.

ఇక మైదానంలో కోహ్లి జట్టు ఓటమిని అసలు ఒప్పుకోడు. బ్యాటర్గా, కెప్టెన్గా అయినా ప్రత్యర్థిని మట్టికరిపించేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాడు. అతడు సెంచరీ సాధించకపోతే ఫామ్లో లేడనే విమర్శలు వచ్చే విధంగా ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఇలాంటి ఘనత కలిగిన ఈ స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమవ్వడం అందరికి పెద్ద షాకే. మరోవైపు రెండో సారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు. దీంతో కొందరు కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మపై విమర్శలు మొదలుపెట్టారు.
2021 ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టు సిరీస్లో తొలి టెస్టు అనంతరం కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. తొలిసారి తండ్రి కాబోతున్న క్షణంలో తన భార్య అనుష్కతో కలిసి ఉండాలని భావించాడు. ఆ విరామం తర్వాత కోహ్లి ఫామ్ పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాడు. సెంచరీ కోసం ఏకంగా 1214 రోజులు ఎదురుచూశాడు. అంతిమంగా తిరిగి సూపర్ ఫామ్లోకి వచ్చాడు.
ఇప్పుడు మరోసారి కోహ్లి బ్రేక్ తీసుకోవడంతో అతడి భవితవ్వంపై సందేహాలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లికి అన్నిఫార్మాట్లలో ప్రత్యామ్నాయ ప్లేయర్లను వెతికే పనిని బీసీసీఐ ఇప్పటికే నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో కోహ్లి జట్టుకు దూరమవ్వడం తన కెరీర్ పరంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. తన వ్యక్తిగత పనులు ముగించుకుని బలంగా తిరిగి రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.