టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ఎంతో సామర్థ్యం ఉందని, కానీ తనకు ఉన్న ప్రతిభకు గిల్ అన్యాయం చేస్తున్నాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్ సిరీస్లో రెండో టీ20లో బెంచ్కు పరిమితమైన గిల్ గురించి సల్మాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యశస్వీ జైశ్వాల్ రాకతో టీ20ల్లో గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే గతేడాది సంచలన ప్రదర్శనతో పరుగుల వరద పారించిన గిల్ గత కొన్ని మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఫ్లాట్ వికెట్పైనే పరుగులు చేయగలడని అతడిపై విమర్శలు వస్తున్నాయి. 2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా గిల్ నిలిచిన విషయం తెలిసిందే. 29 మ్యాచ్ల్లో 1584 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్గా రికార్డు కూడా సాధించాడు.

కానీ, ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో గిల్ 2, 26, 36, 10 పరుగులతో నిరాశపరిచాడు. రెండు సార్లు క్లీన్బౌల్డయ్యాడు. అఫ్గానిస్థాన్తో మొహాలి వేదికగా జరిగిన తొలి టీ20లో 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు. గిల్ పేలవ ప్రదర్శన, ఎడమచేతి వాటం కలిగి ఉన్న కారణాలతో జైశ్వాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
''గత కొన్ని మ్యాచ్ల్లో గిల్ తన ప్రతిభకు అన్యాయం చేస్తున్నాడు. అతడు చాలా మంచి ప్లేయర్, ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే 23 పరుగులు చేశాక చెత్త షాట్కు ఔటయ్యాడు. గతేడాదిలో విజయవంతమైన ప్రదర్శన చేసిన తర్వాత ఇలానే ఆడతారా? అతడు ప్రత్యేకంగా ఆడాలనుకోకుండా బ్యాటింగ్ మాత్రమే చేయాలి. ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్ అయినప్పటికీ ప్రతి బంతిని సమర్థంగా షాట్ ఆడలేరనే విషయాన్ని గిల్ గ్రహించాలి. బంతికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వాలి'' అని సల్మాన్ బట్ అన్నాడు.

కాగా, బెంగళూరు వేదికగా జనవరి 17న అఫ్గానిస్థాన్తో భారత్ సిరీస్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్ సిరీస్ అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.