టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు హాస్య చతురత కాస్త ఎక్కువ. ప్రెస్మీట్లో ఎదురయ్యే భిన్నమైన ప్రశ్నలకు రోహిత్ చెప్పే సమాధానాలు ఎంతో సరదాగా ఉంటాయి. అంతేకాకుండా మైదానంలో అతడు చేసే కొన్ని పనులు నవ్వులు పూయిస్తాయి. టాస్ సమయంలో తుదిజట్టును మరిచిపోవడం, బ్యాటింగ్ లేదా బౌలింగ్ తీసుకోవాలా అని కెమెరా ముందు అయోమయానికి గురికావడం ఫన్నీగా అనిపిస్తుంటాయి. ఇటీవల అఫ్గానిస్థాన్ సిరీస్లో అంపైర్తో మాట్లాడిన రోహిత్ సంభాషణ నెట్టింట్లో వైరల్గా మారింది.
తాజాగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అంపైర్ సలహాను తీసుకోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నించడం విశేషం. అసలేం జరిగిందంటే.. ఇన్స్వింగర్, ఔట్ స్వింగర్లతో జో రూట్ (5)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టోకు బుమ్రా అద్భుతమైన యార్కర్ను విసిరాడు. అది బెయిర్ స్టో ప్యాడ్లకు నేరుగా తగింది. దీంతో టీమిండియా ప్లేయర్లు ఔట్గా అపీలు చేశారు. కానీ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు ఒక్క పరుగు తీశారు.

అయితే రోహిత్ శర్మ బౌలర్ బుమ్రాతో పాటు ఇతర ప్లేయర్లతో రివ్యూకి వెళ్లాలా? వద్దా? అని చర్చించాడు. కానీ చివరికి సమీక్ష కోరలేదు. ఈ లోపు పక్కనే ఉన్న అంపైర్తో రోహిత్ సరదాగా మాట్లాడాడు. 'ఈ విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు' అని అంపైర్ను హిట్ మ్యాన్ అడిగాడు. అప్పటికీ సమీక్ష కోరే గడువు ముగియడంతో 'లెగ్ బై' అని అంపైర్ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంపైర్లతో రోహిత్ ఫ్రెండిషిప్ బాగుంటుందని,వాళ్లను కూడా ఎనర్జటిక్గా ఉంచుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు రెండో రోజు ఆటటో టీ విరామానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (5), బెయిర్ స్టో (24) క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలే (76; 78 బంతుల్లో), బెన్ డకెట్ (21; 17 బంతుల్లో), ఒలీ పోప్ (23; 55 బంతుల్లో), జో రూట్ (5; 10 బంతుల్లో) పరుగులు చేశారు. బుమ్రా రెండు వికెట్లు, కుల్దీప్, అక్షర్ చెరో వికెట్ తీశారు.