టీమిండియా స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన బ్యాటింగ్, కెప్టెన్సీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అయితే హర్మన్ ప్రీత్ ను కలిసి, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఓ మహిళా అభిమాని తీవ్రంగా ప్రయత్నించింది.
వాంఖడే వేదికగా బుధవారం భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే తమ ఫేవరేట్ ప్లేయర్స్ హర్మన్ ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ ను కలిసేందుకు కొందరు స్టేడియానికి వచ్చారు. కానీ చివరికి వారికి నిరాశే ఎదురైంది. దీంతో ఓ అభిమాని భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీటి పర్యంతమైంది. హర్మన్ ప్రీత్ తన ఫేవరేట్ ప్లేయర్ అని, కలవలేకపోయానని ఏడ్చేసింది. మరోసారి కలుద్దాంలే అని ఆమెని ఫ్రెండ్స్ ఓదార్చారు.

అయితే ఈ వీడియో నెటింట్లో చక్కర్లు కొట్టింది. అభిమాని ఫ్యాన్ కు ఫిదా అయిన హర్మన్ ప్రీత్ సైతం ఈ వీడియోపై స్పందించింది. వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ప్రేమ, అమాయకత్వం కలిసిన క్షణం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మొత్తంగా ఆ అభిమాని ఆటోగ్రాఫ్ తీసుకోలేకపోయినా హర్మన్ ప్రీత్ ప్రేమను పొందింది.

కాగా, ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత మహిళా జట్టు 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లకు 197 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది.
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా రేపు ఇంగ్లాండ్-టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. సిరీస్ ను కాపాడుకోవాలంటే రేపటి మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాల్సిందే. సిరీస్ లో ఆఖరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇంగ్లాండ్ తో టీమిండియా ఒక టెస్టు కూడా ఆడనుంది. డిసెంబర్ 14న టెస్టు ప్రారంభం కానుంది.