నాటింగ్హామ్: రెండు టెస్టుల పరాజయం తర్వాత కచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది భారత్. ఇంగ్లాండ్ వేదికగా ఆతిథ్య జట్టుపై విరుచుకుపడుతున్న టీమిండియా భారీ టార్గెట్నే అప్పగించింది. ఇంగ్లాండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి కోహ్లీనే టార్గెట్ చేసిన ఇంగ్లీషు బౌలర్లు కెప్టెన్ని టార్గెట్ చేసేందుకు భారీగానే యత్నిస్తున్నారు. అయినా ఇంగ్లాండ్ బౌలర్లను బురిడీ కొట్టేస్తూ.. కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. రికార్డులు తిరగరాసేస్తున్నాడు.
రికార్డు సృష్టించడమే మామూలు విషయం కాదంటే దాన్ని బ్రేక్ చేయడం సాధారణ విషయం కాదు. క్రికెట్లో రికార్డులు ఇప్పటికే ఎన్నో రికార్డులు మరుగున పడిపోయాయి. గాడ్ ఆఫ్ క్రికెట్గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ గతంలో అన్ని రికార్డులను చెరిపేశాడు. తానో శిఖరంగా మారిన సచిన్.. రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ రికార్డులను దాటేస్తున్నాడు.
ఇలానే చూస్తే.. సెంచరీలు, పరుగుల విషయంలో ఏదో నాటికి మాస్టర్ బ్లాస్టర్ రికార్డులను కోహ్లి బీట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా ఇంగ్లాండ్ టీమ్పై కోహ్లి సెంచరీ చేసేశాడు. ఇదేమీ సచిన్ రికార్డును బీట్ చేయలేదుగానీ.. ఈ సెంచరీకి సచిన్ 17 ఏళ్ల కిందట సాధించిన సచిన్ సెంచరీకి ఒకే పోలికలు ఉండటం గమనార్హం.
ఇది కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 58వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్లో కోహ్లి 103 పరుగులు చేశాడు. అయితే సరిగ్గా 17 ఏళ్ల కిందట సచిన్ కూడా ఇదే ఇంగ్లండ్ జట్టుపై కెరీర్లో 58వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్లో మాస్టర్ కూడా సరిగ్గా 103 పరుగులే చేయడం విశేషం. అంతేకాదు ఈ స్కోరు చేయడానికి ఇద్దరూ ఎదుర్కొన్న బంతులు కూడా 197 కావడం మరో విశేషం. కానీ అప్పుడు సచిన్ వయసు 28 ఏళ్లు కాగా.. ఇప్పుడు కోహ్లి వయసు 29.