స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించే పనుల్లో బీసీసీఐ నిమగ్నమైనట్లు వస్తున్న వార్తలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో ఏ ఆటగాడికి లేనంత క్రేజ్ కోహ్లికి ఉందని తెలిపాడు. ప్రజల్లోకి క్రికెట్ను మరింత చేర్చడానికి అమెరికాలో ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్కు కోహ్లి ఓ కారణమని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్కు కోహ్లిని ఎంపిక చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పిచ్లు చాలా స్లోగా ఉంటాయని, అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్లు ఆడే కోహ్లి జట్టుకు భారమవుతాడనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు సాధించట్లేదని టీమిండియా యాజమాన్యం, బీసీసీఐపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు న్యూస్ వచ్చింది.

టీమిండియా నుంచి విరాట్ కోహ్లిని తప్పించడమనేది సులువైన విషయం కాదు. క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అందుకే ఈ సున్నితమైన విషయాన్నినిర్వర్తించే బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు అప్పగించినట్లు సమాచారం. మెగాటోర్నీ నుంచి స్వచ్ఛందంగా కోహ్లినే తప్పుకునేలా అగార్కర్ ప్రయత్నిస్తునున్నట్లు తెలుస్తోంది.'ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే ఈ విషయంలో ఎక్కువమంది పాల్గొనడానికి ఇష్టపడట్లేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
దీనిపై స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ''ఇది అవాస్తవం. అభిమానుల దృక్కోణంలో ఆటను మరింత మెరుగుపర్చాడానికి అమెరికాలో ఐసీసీ మ్యాచ్లు నిర్వహిస్తుంది. న్యూయార్క్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలో ఏ ఆటగాడికి లేని క్రేజ్ విరాట్ కోహ్లిది. అతడు కచ్చితంగా ఎంపిక అవుతాడు'' అని బ్రాడ్ పేర్కొన్నాడు. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు మినహా మిగిలిన మ్యాచ్లన్నీ వెస్టిండీస్లోనే జరగనున్నాయి.
కోహ్లి స్థానంలో యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ శివమ్ దూబె వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే ఐసీసీకి మే నెల మొదటి వారంలో వరల్డ్ కప్ ప్రొవిజినల్ స్క్వాడ్ను పంపించాల్సి ఉంది. ఈ సమయంలోపు ఐపీఎల్ 70 శాతం పూర్తవుతుంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అప్పటిలోపు బీసీసీఐ తమ ఆలోచనలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు.