ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. శుభ్మన్ గిల్ (104; 147 బంతుల్లో) సెంచరీతో చెలరేగడంతో మూడో రోజు ఆటలోనూ భారత్ టాప్లో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఆటను ఆరంభించిన టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో) సెకండ్ టాప్ స్కోరర్. అనంతరం 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఇవాళ ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది.
క్రీజులో జాక్ క్రాలే (29*; 50 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (9*; 8 బంతుల్లో) ఉన్నారు. బెన్ డకెట్ (28; 27 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేశాడు. విజయానికి భారత్ తొమ్మిది వికెట్ల దూరంలో, ఇంగ్లండ్ 332 పరుగుల దూరంలో ఉన్నాయి. అయితే ఆదివారం ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టేడియంలో జోష్ను నింపాడు. బౌండరీలు, సిక్సర్లతో కాదు.. మరోసారి తన హాస్య చతురత అందరిని నవ్వించాడు. అసలేం జరిగిందంటే..

ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు బుమ్రా బౌలింగ్ను జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. అయితే మూడో ఓవర్లో క్రాలేకు బుమ్రా ఔట్ స్వింగర్ విసిరాడు. బంతి బ్యాటుకు తాకుతూ వెళ్లినట్లుగా అనిపించడంతో టీమిండియా ఔట్ అంటూ అపీలు చేసింది. కానీ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో సమీక్షకు వెళ్లాలా వద్దా అని ఆటగాళ్లతో కెప్టెన్ రోహిత్ శర్మ చర్చించాడు. మరోవైపు కుల్దీప్ ఈ విషయంపై రోహిత్కు ఔట్ అనిపించేలా వివరించాడు.
కానీ కుల్దీప్ వివరణకు రోహిత్ శర్మ సంతృప్తి చెందలేదు. అంతేగాక అసలేం ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమైతుందా అన్నట్లుగా కుల్దీప్ వైపు ఓ లుక్ ఇచ్చాడు. ఈలోపు రివ్యూ కోరే సమయం కూడా అయిపోయింది. అయితే కాసేపటికీ అది నాటౌట్గా రిప్లేలో తేలింది. దీంతో రివ్యూ తీసుకోకుండా ఎంతో మంచి పని చేసినట్లుగా రోహిత్ సంబరపడ్డాడు. క్లాప్స్ కొడుతూ థంబ్స్ అప్ సింబల్స్ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
శనివారం జరిగిన ఆటలో కూడా రివ్యూ టైమ్లో రోహిత్ సరదాగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సమీక్ష విషయంలో అంపైర్ సలహాను తీసుకోవడానికి హిట్ మ్యాన్ ప్రయత్నించాడు. 'ఈ విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు' అని అంపైర్ను రోహిత్ ప్రశ్నించడం ఫన్నీగా అనిపించింది.