
హైదరాబాద్: కోహ్లీ ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రత్యేక అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లి తొలిసారి భారత జట్టుకు ఎంపికైనపుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యాడు? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''ఆ రోజు భారత సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో నేను మా అమ్మతో కలిసి టీవీలో వార్తలు చూస్తున్నా. ఉన్నట్లుండి టీవీలో నా పేరు తెరపై అలా మెరిసి ఇలా మాయమైంది. అయితే అది నిజం కాదేమో అనుకున్నా. ఐదు నిమిషాల తర్వాత బీసీసీఐ నుంచి ఒకరు ఫోన్ చేసి నా ఎంపిక గురించి చెప్పారు' అని ఆ సంఘటన గుర్తు చేసుకున్నాడు.
అప్పటి పరిస్థితిని విశ్లేషిస్తూ.. 'రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వణికిపోయాను. అది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఇక భారత జట్టును కలిసి సమావేశంలో పాల్గొన్న రోజు నన్ను ప్రసంగించమన్నారు. చాలామంది గొప్ప ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో ఉండటంతో భయంగా అనిపించింది. వాళ్లందరూ నావైపే చూస్తున్నారు. ఇప్పుడు మేం కూడా కుర్రాళ్లను భయపెట్టడానికి అలాగే చూస్తుంటాం. ఇవీ అప్పటి నా అనుభవాలు'' అని కోహ్లి చెప్పాడు.
చిన్నప్పట్నుంచి క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడటాన్ని ఆస్వాదించేవాడినని.. కెరీర్ గురించి ఆలోచించకుండా తాను క్రికెట్ ఆడుతుండేవాడినని అన్నాడు. పరీక్షల సమయంలో కూడా మధ్యలో ఉపశమనం కోసం క్రికెట్ ఆడేవాడినని.. అప్పుడు చదువుకోవడానికి మరింత ఉత్సాహం వచ్చేదని విరాట్ తెలిపాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోహ్లీ ప్రతి ఒక్కరూ ఫిట్నెస్తో ఉండాలని ఫిట్ గా ఉండటం ద్వారా ఏదైనా సాధించగలమనే పట్టుదల వస్తుందని పేర్కొన్నాడు.