అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. దాదాపు 14 నెలల తర్వాత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అయితే భారత జట్టు ఎంపికపై సెలక్టర్లు తమ స్పష్టమైన వైఖరి చెప్పడంలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.
ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ ఎంపిక చేయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారా లేదా తప్పించారా అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్ రాహుల్ సత్తాచాటాడు. కానీ రాహుల్ను ఎంపిక చేయలేదు. కోహ్లి, రోహిత్తో పాటు రాహుల్ కూడా గత 14 నెలల నుంచి టీమిండియా తరపున టీ20లు ఆడలేదు.

టీ20 వరల్డ్ కప్ ప్రణాళికలో రాహుల్ లేకపోవడంతోనే సెలక్టర్లకు అతడికి మొండిచేయి చూపించారని కథనాలు వస్తున్నాయి. ఇదే వాస్తవమైతే తిరిగి టీమిండియా టీ20 జట్టులో రాహుల్ స్థానం సంపాదించాలంటే ఐపీఎల్ వచ్చే సీజన్లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వివరించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టీ20ల సిరీస్లో శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించారని ఆకాశ్ చోప్రా గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా ఎంపిక చేశారని, కానీ అఫ్గానిస్థాన్ సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని చోప్రా ప్రశ్నించాడు. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీసులకు ఎంపిక చేయని శివమ్ దూబెను అఫ్గానిస్థాన్ సిరీస్కు ఎంపిక చేయడంలో సెలక్టర్లు వైఖరి అర్థం కావట్లేదని చోప్రా పేర్కొన్నాడు.
మరోవైపు జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్లోకి వచ్చింది. సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇషాన్ మానసిక ఆందోళన కారణంగా జట్టుకు దూరమవ్వడంతో అతడిని ఎంపిక చేయలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కాగా, జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది
భారత జట్టు వివరాలు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్