ఆహా ఏమి విజయం:
భారత టెస్టు క్రికెట్ చరిత్ర గతిని మార్చిన కోల్కతా టెస్టు విజయాన్ని అప్పటి టీం కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నాడు. కోల్కతా టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం అనంతరం భారత డ్రెస్సింగ్ రూమ్లో సంబురాలు చేసుకుంటున్న వీడియోపై.. ఆ మ్యాచ్ తాలుకు జ్ఞాపకాలను దాదా నెమరువేసుకున్నాడు. ఆ వీడియోకు 'ఆహా ఏమి విజయం' అని కాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. దాదాతో పాటు అభిమానులు కూడా ఆ మ్యాచ్ తాలుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఫాలోఆన్ ఆడి అద్భుత విజయం:
2001 మార్చి 11 నుంచి 15 వరకు కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరిగింది. ఆ మ్యాచ్ పూర్తయి నేటికి 19 ఏళ్లు. అందుకే దాదా అలనాటి రోజుల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోవడంతో భారత క్రికెట్ జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి. ఇలాంటి కఠిన సమయంలో తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరే చేసిన టీమిండియా.. ఫాలోఆన్ ఆడి అద్భుత విజయాన్ని అందుకుంది. భారత క్రికెట్కు ఆ ఒక్క విజయం తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చింది. అప్పుడు దాదా ఓ హీరో అయ్యాడు.

స్టీవ్ వా సెంచరీ:
2001 మార్చి 11 నుంచి 15 వరకు కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు అది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచరీకి చేయగా.. మాథ్యూ హెడెన్ (97), జస్టిన్ లాంగర్ (58) అర్ధ శతకాలు బాదడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏడు వికెట్లు తీసాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం.

లక్ష్మణ్ మారథాన్ ఇన్నింగ్స్:
తొలి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ తడబడటంతో 171 పరుగులకే భారత్ ఆలౌటైంది. వీవీఎస్ లక్ష్మణ్ (59) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమే అని అందరూ అనుకున్నారు. ఇక స్టీవ్ వా టీమిండియాను ఫాలోఆన్కు ఆహ్వానించాడు. శివసుందర్ దాస్ (39), శటగోపన్ రమేశ్ (30), సచిన్ టెండూల్కర్ (10) నిరాశపరచగా.. గంగూలీ (48) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లక్ష్మణ్ (281) టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

హర్భజన్ మాయ:
'ది వాల్' రాహుల్ ద్రవిడ్ (180)తో కలిసి లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 376 పరుగులు జోడించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 657/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ 384 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 212కు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరు వికెట్లతో హర్భజన్ మళ్లీ మాయ చేసాడు. లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా వరుస 16 టెస్ట్ విజయాలకు బ్రేక్ పడింది.


Click it and Unblock the Notifications












