స్లో ఓవర్రేట్:
ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్.. నిర్దేశిత సమయంలో 46 ఓవర్లే వేసింది. సమయం దాటిన తర్వాత మిగతా నాలుగు ఓవర్లు పూర్తి చేసింది. ఏదైనా మ్యాచ్లో ఒకటి లేదా రెండు ఓవర్లు తక్కువగా వేయడం సర్వసాధారణమే. కానీ.. కీరన్ పొలార్డ్ సేన ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.
మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత:
స్లో ఓవర్రేట్ కారణంగా విండీస్ జట్టు మొత్తం జరిమానాకు గురైంది. నిర్ణీత సమయంలో విండీస్ నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియామవళి ఆర్టికల్ 2.22 ప్రకారం ఓవర్కు 20 శాతం చొప్పున.. 4 ఓవర్లకు 80 శాతం మ్యాచ్ ఫీజును బూన్ కోత విధించారు. 'ఐసీసీ నిబంధనల ప్రకారం కోత విధించాం. ఓవర్కు 20 శాతం చొప్పున 4 ఓవర్లకు విండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత వేశాం' అని ఐసీసీ సోమవారం పేర్కొంది.
వెస్టిండీస్ ఘన విజయం:
తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి గెలిచింది. యువ బ్యాట్స్మెన్ షిమ్రోన్ హెట్మెయిర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకుపడి అద్భుత సెంచరీ చేసాడు. షై హోప్ కూడా సమయోచిత సెంచరీ (151 బంతుల్లో 102: 7 ఫోర్లు, 1 సిక్సర్) చేసి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (88 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (69 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
నేడు ప్రాక్టీస్:
బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ వన్డే కోసం భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు సోమవారం ఉదయం చెన్నై ఎయిర్పోర్టు నుంచి ఇండిగో విమానం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో అడగుపెట్టిన క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి.