
వెస్టిండీస్ జట్టు స్టార్ ప్లేయర్లు నేషనల్ టీం కంటే ఎక్కువగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్లను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. తద్వారా రోజురోజుకు వెస్టిండీస్ జట్టు నాసికట్టుగా తయారవుతుంది. ఇక ఈ విషయమై ఆ జట్టుప్రధాన కోచ్ ఫిల్ సిమన్స్ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గానీ పెద్దగా చేయడానికి ఏమీ లేదని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. తమ జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. తద్వారా ఇటీవల నికోలస్ పూరన్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు టీ20సిరీస్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇకపోతే ఎవిన్ లూయిస్, షానే థామస్ ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో జట్టుకు ఎంపిక కాలేదు. షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్, రోస్టన్ చేజ్ గాయాలతో దూరమయ్యారు.
ఇక రస్సెల్ అయితే చివరిసారిగా వెస్టిండీస్ తరఫున టీ20ప్రపంచకప్లో గతేడాది ఆడాడు. 2019నుంచి నరైన్ జట్టుకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాడు. అయ్యా బాబు వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు అని ఫిల్ సిమన్స్ చెప్పాడు. అక్టోబర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు మనీ కోసం ఫ్రాంచైజీ లీగ్కే మొగ్గు చూపుతున్నారు.
ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదని సిమన్స్ అభిప్రాయపడ్డాడు. తమకు వేరే మార్గం లేదని, ఎవరూ ఈ విషయంలో ఏమీ చేయలేరని పేర్కొన్నాడు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడి అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్లను వదులుకుంటే తప్పితే గానీ బోర్డు గానీ తాను గాను ఏమీ చేసేందుకు ఉండదని సిమన్స్ పేర్కొన్నారు. గత సంవత్సరం యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ దారుణ పరాభవాన్ని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే.