ఆస్ట్రేలియాలో టెస్టు సందడి కొనసాగుతోంది. పాకిస్థాన్తో టెస్టు సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ ఇప్పుడు వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. అడిలైడ్ వేదికగా ఇవాళ మొదటి టెస్టు ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 59 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఖవాజా (30*), కామెరూన్ గ్రీన్ (6*) ఉన్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 188 పరుగులకే ఆలౌటైంది. ఆదిలోనే ఓపెనర్లు చంద్రపాల్ (6), బ్రాత్వైట్ (13) ను కమిన్స్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన అథనాజ్ (13) కూడాఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడంతో విండీస్ 52 పరుగులకే వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హోడ్జ్ (12)తో కలిసి మెకంజీ (50) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్కు 46 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మెకంజీ అర్ధశతకం సాధించాడు.

అయితే హేజిల్వుడ్ చెలరేగడంతో వెస్టిండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 133 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖరి వికెట్కు రోచ్ (17)తో కలిసి షామర్ జోసెఫ్ (36) 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, హేజిల్వుడ్ చెరో నాలుగు వికెట్లు, స్టార్క్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన షామర్ తన తొలి బంతికే స్మిత్ను ఔట్ చేయడం విశేషం. పదునైన జప్ఫాను స్మిత్ సమర్థవంతంగా ఎదుర్కోలేక స్లిప్లో జస్టిన్ చేతికి చిక్కాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన లబుషేన్ (10)ను కూడా షామర్ పెవిలియన్కు చేర్చాడు. అయితే స్మిత్ తన టెస్టు కెరీర్లో తొలి స్థానం నుంచి తొమ్మిది స్థానాల వరకు బ్యాటింగ్కు రావడం విశేషం.