
ప్రావిడెన్స్: వెస్టిండీస్ పర్యటనలో భారత మహిళా జట్టు విజయాల పరంపర ఆగడం లేదు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ సేన.. అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ పర్యటనలో వరుసగా ఆరో విజయాన్ని (రెండు వన్డేలు, నాలుగు టీ20లు) భారత్ తమ ఖాతాలో వేసుకుంది.
గయానాలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. చాలా సమయం వృధా అవ్వడంతో అంపైర్లు మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ఉమెన్లలో మొదటి ఐదుగురు సింగల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ పర్యటనలో పరుగుల వరద పారించిన ఓపెనర్ షెఫాలీ వర్మ (7) తీవ్రంగా నిరాశపరిచింది. పూజ (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో మాథ్యూస్ (3/13) మూడు వికెట్లు తీసింది.
అనంతరం మోస్తరు లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ఉమెన్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు. భారత బౌలర్లు అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఈ విజయంతో భారత్ సిరీస్లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి మ్యాచ్ నవంబర్ 20న జరగనుంది.
మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 59 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ క్రీడాకారిణుల్లో చేదన్ నేషన్ (11), హెన్రీ (11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్ (40 నాటౌట్) చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.