|
ఆరంభంలోనే షాక్:
వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విండీస్ బౌలర్లు రోచ్, గాబ్రియెల్ ధాటికి 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) రోచ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మొదట ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా.. విండీస్ రివ్యూ కోరి సక్సెస్ అయింది. రోచ్ అదే ఓవర్లో పుజారాను కూడా పెవిలియన్ చేర్చాడు. అప్పటికి స్కోరు కేవలం 7 పరుగులే. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా.. గాబ్రియెల్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
నిలబెట్టిన రాహుల్:
ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ రాహుల్ మాత్రం అద్భుతంగా రాణించాడు. రహానే కూడా రాహుల్తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో లంచ్ సమయానికి భారత్ 68/3తో నిలిచింది. లంచ్ అనంతరం రాహుల్, రహానే ఇద్దరూ వికెట్లను కాచుకొని మరిన్ని పరుగులు జోడించారు. అయితే చేజ్ బౌలింగ్లో రాహుల్ ఔట్ కావడంతో.. 68 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆదుకున్న రహానే:
అనంతరం రహానేకు హనుమ విహారి తోడవడంతో ఇన్నింగ్స్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. ఈ సమయంలో వరుణుడు అడ్డుపడ్డా టీ విరామం తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన ఈ జోడీ విండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న విహారి.. రోచ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ జోడి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కాసేపటికే రహానే కూడా గాబ్రియెల్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. పంత్ (20), జడేజా (3) మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఈ దశలో వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. దీంతో అంపైర్లు తాత్కాలిక విరామం ప్రకటించారు. కాసేపటికే వర్షం ఆగినా.. వాతావరణం సహకరించకపోవడంతో మరో సెషన్ మిగిలి ఉండగానే తొలి రోజు ఆటను నిలిపేశారు.