
మూడు టీ20ల సిరిస్లో టీమిండియా శుభారంభం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో వెస్టిండిస్తో శనివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండిస్ నిర్దేశించిన 96 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ 24, కోహ్లీ 19 పరుగులు చేశారు. కాట్రెల్, నరైన్, కీమో పాల్కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా సైనీ నిలిచాడు.
స్వల్ప లక్ష్యమే అయినా భారత్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ధావన్ (1)ను కాట్రెల్ ఔట్ చేశాడు. కానీ రోహిత్ మాత్రం బంతికో పరుగు చొప్పున వేగం కనబరుస్తూ ఆరో ఓవర్లో 4,6తో జోరు చూపించాడు. అయితే స్పిన్నర్ నరైన్ మరుసటి ఓవర్లో రోహిత్తో పాటు పంత్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చాడు.
33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లీకి జతగా మనీశ్ పాండే కలిశాడు. ఆ తర్వాత మూడు ఓవర్ల వ్యవధిలో వీరిద్దరు కూడా పెవిలియన్ చేరారు. దీంతో 69 పరుగులకు జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, క్రునాల్ పాండ్యా (12), జడేజా (10 నాటౌట్) దూకుడుగా ఆడారు. మరో 16 బంతులుండగా వాషింగ్టన్ (8 నాటౌట్) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు.
టీమిండియా విజయ లక్ష్యం 96
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. ఆరుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగిన భారత్ అద్భుత ఫలితం సాధించింది. తొలి ఓవర్ నుంచే సాగిన వికెట్ల పతనం ఏదశలోనూ ఆగలేదు. పొలార్డ్ మాత్రం చివరిదాకా పోరాడాడు. తన అరంగేట్ర మ్యాచ్లో పేసర్ నవ్దీప్ సైనీ చెలరేగాడు.
తొలి ఓవర్ రెండో బంతికే కాంప్బెల్ (0)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా మరుసటి ఓవర్లో భువీ దెబ్బకు ఓపెనర్ లూయి్సకూడా డకౌటయ్యాడు. ఈ దశలో నికోలస్ పూరన్ (20) ఉన్నకాసేపు బౌండరీలతో చెలరేగాడు. పొలార్డ్తో కలిసి మూడో వికెట్కు 20 పరుగులు జోడించాడు. సైనీ వరుస బంతుల్లో పూరన్, హెట్మయర్ (0)ను పెవిలియన్కు చేర్చాడు.
ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో విండిస్ వికెట్లు కోల్పోయింది. బ్రాత్వైట్ (9) పరుగులు తీయకపోయినా పొలార్డ్కు కాసేపు సహకారం అందించగా 8వ వికెట్కు 34 రన్స్ చేరాయి. ఆఖరి ఓవర్లో సైనీ.. పొలార్డ్ వికెట్ తీయడంతో పాటు మేడిన్తో ముగించాడు. దీంతో విండీస్ టీ20ల్లో ఐదో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
భారత్ బౌలర్లలో నవ్దీప్ సైనీ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని పలువురు యువ క్రికెటర్లకు ఈ సిరిస్లో సెలక్టర్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొల టీ20లో బ్యాటింగ్లో మనీశ్ పాండే... బౌలింగ్లో నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్లకు జట్టు మేనేజ్మెంట్ అవకాశమిచ్చింది.
అమెరికాలో క్రికెట్కి ఆదరణ పెంచేందుకు ఈ టీ20ని ఫ్లోరిడాలో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వెస్టిండిస్తో ఇక్కడ జరిగిన టీ20లో వెస్టిండీస్ ఏకంగా 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (110) మెరుపు సెంచరీ సాయంతో భారత్ లక్ష్యానికి చేరువగా వచ్చింది కానీ.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.