స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్ను వెస్టిండీస్ 3-2తో కైవసం చేసుకుంది. ట్రిండాడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సాల్ట్ (38) టాప్ స్కోరర్. గత మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇదే మైదానంలో 267 పరుగులు చేయడం గమనార్హం.
ఛేదనలో వెస్టిండీస్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి గెలిచింది. అయితే స్వల్ప స్కోరును విండీస్ చెమటోడ్చి ఛేదించిది. ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (3), నికోలస్ పూరన్ (10) ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన షై హోప్ (43*; 43 బంతుల్లో) మరో ఓపెనర్ చార్లెస్ (27; 22 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ అదిల్ రషీద్ బౌలింగ్లో చార్లెస్ ఔటవ్వడంతో విండీస్ కష్టాల్లో పడింది.

అనంతరం రూథర్ఫర్డ్ (30; 24 బంతుల్లో)తో కలిసి హోప్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకొని వికెట్లు సాధించారు. దీంతో వెస్టిండీస్ గెలుపు సమీకరణం ఆఖరి 12 బంతుల్లో 11 పరుగులుగా మారింది. అయితే 19వ ఓవర్ వేసిన టామ్ కరన్ కేవలం రెండు పరుగులే ఇచ్చి రసెల్ వికెట్ పడగొట్టాడు.
భీకర హిట్టర్ అయిన రసెల్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 8 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశారు. ఛేజింగ్ ఆఖర్లో అతడు సింగిల్స్ కూడా తీయలేకపోవడం గమనార్హం. అయితే రసెల్ ఔటైన తర్వాత చివరి ఓవర్లో హోప్ దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ విజయం సాధించింది. మూడు వికెట్లు తీసిన విండీస్ బౌలర్ మొటియ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ సిరీస్లో రెండు వరుస సెంచరీలు బాదిన ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.