హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ పర్యటనకు యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్లకు చోటు కల్పించి, ప్రస్తుతం ఛాంపియన్స్ టోర్నీలో ఆడుతున్న జస్ప్రీత్ బుమ్లా, రోహిత్ శర్మలను తప్పించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
వెస్టిండిస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుక విరాట్ కోహ్లీనే కెప్టెన్గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం టీమిండియా అటు నుంచి అటే వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. జూన్ 23 ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండిస్తో ఐదు వన్డేలతో పాటు ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది.

అయితే టీమిండియా జట్టుతో పాటు వెళ్లే సపోర్టింగ్ స్టాప్ పేర్లను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. జూన్ 18తో టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనుంది. అయినప్పటికీ వెస్టిండిస్ పర్యటనకు జట్టు వెంట అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్గా వెళ్లనున్నాడు. ఈ మేరకు గత వారంలో బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) ఛైర్మన్ వినోద్రాయ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.