కింగ్ స్టన్ : భారత్ , వెస్డిండీస్ ల మధ్య జరిగిన రెండో వన్డేను ఎనిమిది వికెట్ల తేడాతో విండీస్ గెలుచుకుంది. భారత్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 34.1 ఓవర్లలో ఛేదించింది. గేల్ 64(46), శర్వాన్ 15(17) పరుగులకు అవుటయ్యారు. మోర్టాన్ 85(102), చంద్రపాల్ 18(41) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రెండు వికెట్లూ రోహిత్ శర్మ తీసుకున్నాడు. ఆర్పీ (23; 75 బంతుల్లో 1X4, 1X6)కి తనలో కాస్తో కూస్తో ఉన్న బ్యాటింగ్ నైపుణ్యానికి పదును పెట్టక తప్పలేదు. వికెట్లు పారేసుకున్న బ్యాట్స్ మెన్ సిగ్గుపడేలా చేస్తూ గొప్ప పట్టుదలను, పరిణతిని ప్రదర్శించాడు. ఆఖర్లో అతడు అలవోకగా కొట్టిన సిక్సైనా..చెత్తగా ఆడి పెవిలియన్ లో కూర్చున్న బ్యాట్స్ మెన్ కు తమ తప్పు తెలిసొచ్చేలా చేసి ఉంటుంది. ఆర్పీ పరుగులు తక్కువే చేసినా కెప్టెన్ ధోనీ (95; 130 బంతుల్లో 6X4, 2X6)కి అమూల్యమైన సహకారాన్ని అందించాడు. లేదంటే సబైనా పార్క్ లో రెండో వన్డేలో 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా కనీసం వంద పరుగులైనా చేయగలిగేది కాదు. ఆర్పీ అండతో విండీస్ బౌలర్లను విసిగించి...విసిగించి ఒక్కో పరుగే పేరుస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించిన ధోని జట్టు స్కోరును 188 (48.2 ఓవర్లలో) పరుగులకు చేర్చాడు. ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన ధోనీ... ఆర్పీతో కలిసి 9వ వికెట్ కు రికార్డు స్థాయిలో 101 పరుగులు జోడించాడు. భారత ఇన్నింగ్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఓవర్లు 21.3, స్కోరు 8 వికెట్లకు 82. ఆ దశలో భారత్ స్కోరు కనీసం 100 దాటుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. విండీస్ బౌలర్ల (రాంపాల్ 4/37, టేలర్ 3/35, డ్వైన్ బ్రావో 3/26) జోరు...భారత బ్యాట్స్ మెన్ ఆటతీరు చూసిన తర్వాత అలాగే అనిపించింది. ధోనీ క్రీజులో ఉన్నా సరే విండీస్ బౌలర్లు మిగతా ఇద్దరు టెయిలెండర్లను పెవిలియన్ కు పంపించి త్వరగా ఇన్నింగ్స్ ను ముగించడం లాంఛనమే అనిపించింది. కానీ ఊహించని రీతిలో ఆర్పీ నుంచి విండీస్ బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. ధోనీకి అండగా నిలిచిన ఆర్పీ బౌలర్లను విసుగెత్తించాడు. ఆరంభంలో పూర్తిగా తానే బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించిన ధోని ఆర్పీ ఆడగలడని నమ్మకం కుదిరాక అతనికి కూడా స్త్ట్రెకింగ్ ఇచ్చాడు. ఎంతో సహనాన్ని ప్రదర్శించిన ధోని ఒక్కో సింగిల్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు కొట్టడం అంత సులభం కాలేదు. ఐతే చెత్త బంతులను మాత్రం ధోనీ వదల్లేదు. కానీ ఎప్పటిలా ఓ భారీ షాట్ కొట్టగానే ఆవేశపడలేదు. వెంటనే సమయానికి తగినట్లు ఆడాడు. మరోవైపు తొలి 27 బంతుల్లో ఒకే పరుగు చేసిన ఆర్పీ విశ్వాసం పెరిగాక షాట్లు కొట్టడానికి ప్రయత్నించాడు. ఆఖర్లో బెన్ బౌలింగ్ లో సిక్సర్ కూడా కొట్టాడు. ఆర్పీ చివరికి 48వ ఓవర్లో ఔటవడంతో చిరస్మరణీయ భాగస్వామ్యానికి (9వ వికెట్ కు 156 బంతులు) తెరపడింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో ధోని 49వ ఓవర్లో బౌల్డయ్యాడు. అది తొలి వన్డే మైదానమే...అదే పిచ్ ...టాస్ కూడా మనదే...ఆరంభమూ అంతే. కానీ ఆ తర్వాతే అంతా తేడా! భారత్ ను ఆదుకునే వారే కవరయ్యారు. చెత్త ఫుట్ వర్క్ , పేలవవమైన షాట్లతో బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరే పెవిలియన్ కు చేరారు. భారత్ రెండు ఓవర్లు ముగియక ముందే 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. టేలర్ తొలి ఓవర్లో దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి కార్తీక్ (4) ఔటవగా రెండో ఓవర్లో (రవి రాంపాల్ ) గంభీర్ (0), రోహిత్ (0) వికెట్లు పారేసుకున్నారు. ధోని అండగా యువరాజ్ (35; 33 బంతుల్లో 5X4, 1X6) మెరుపులు మెరిపించడంతో భారత్ కోలుకుంటున్నట్లు కనిపించింది. కానీ 54 పరుగుల వద్ద యువీ ఔటవడంతో మళ్లీ పతనం ఆరంభమైంది. యూసుఫ్ పఠాన్ (0), జడేజా (7), హర్భజన్ (7) పెవిలియన్ కు వరుసకట్టారు. విండీస్ వికెట్ కీపర్ రామ్ దిన్ ఐదు క్యాచ్ లు పట్టడం విశేషం.