ఆంటిగ్వా: ఆగష్టు 3 నుంచి టీమిండియాతో జరిగే టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 14 మందితో కూడిన విండీస్ జట్టును సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు. ఈ రెండు టీ20లకు విండీస్ 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ దూరమయ్యాడు. కెనడా గ్లోబల్ టీ20 లీగ్ కారణంగా గేల్ అందుబాటులో ఉండటం లేదని విండీస్ బోర్డు తెలిపింది.
ప్రపంచకప్ జట్టులో చోటుదక్కించుకోని సీనియర్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్లు టీ20లలో చోటు దక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం చివరి టీ20 ఆడిన నరైన్ తిరిగి చోటు దక్కించుకోవడం విశేషం. పోలార్డ్ కూడా గత నవంబర్ నెలలో చివరి టీ20 ఆడాడు. అయితే ఐపీఎల్-12లో మాత్రం అదరగొట్టాడు. అద్భుత ఫీల్డింగ్ కూడా చేసాడు. గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీ మధ్య నుండే వైదొలిగిన ఆండ్రీ రసెల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు జట్టులో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. వికెట్ కీపర్/బ్యాట్స్మన్గా ఆంథోని బ్రాంబెల్ అరంగేట్రం చేయనున్నాడు. బ్రాంబెల్ ఇప్పటివరకూ 12 టీ20, 46 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. మూడు అంతర్జాతీయ టీ20లు ఆడిన ఖారీ పైర్రీతో పాటు జాన్ క్యాంప్బెల్కు చోటు దక్కింది.
జట్టు:
కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), జాన్ క్యాంప్బెల్, ఎవిన్ లూయిస్, హెట్మెయిర్, నికోలస్ పూరన్, కీరోన్ పొలార్డ్, రావ్మాన్ పావెల్, కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్, ఆంథోని బ్రాంబెల్, ఆండ్రీ రసెల్, ఖారీ పైర్రీ.