టీ20 ప్రపంచకప్లో లీగ్ దశను వెస్టిండీస్ ఘనంగా ముగించింది. సెయింట్ లూసియా వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్థాన్పై 104 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. నికోలస్ పూరన్ (98; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43; 27 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు.
కెప్టెన్ పావెల్ (26; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), షై హోప్ (25; 17 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. గుల్బాదిన్ నైబ్ (2/14) రెండు వికెట్లు, నవీనుల్ హక్ (1/41), అజ్మతుల్లా (1/41) తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38; 28 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్సర్) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ (3/14) మూడు, అకీల్ హొస్సేన్ (2/21), మొయెట్జీ (2/28) చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే ఈ క్రమంలో వెస్టిండీస్ పలు రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్లో పూరన్ విరుచుకుపడటంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత చార్లెస్ కూడా బ్యాటు ఝుళిపించడంతో విండీస్ పవర్ప్లేలో 92/1తో రికార్డు స్కోరు సాధించింది. అంతకుముందు పవర్ ప్లే అత్యధిక స్కోరు రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉండేది.
2014 వరల్డ్ కప్లో ఐర్లాండ్పై నెదర్లాండ్స్ తొలి ఆరు ఓవర్లలో 91/1 స్కోరు సాధించింది. మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ 2016 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై 89/3 స్కోరు చేసింది. కాగా, పరుగుల పరంగా వెస్టిండీస్కు ఇది రెండో అత్యుత్తమ గెలుపు. ఈ మెగాటోర్నీలో ఉగాండపై 134 పరుగులతో నెగ్గడం మొదటి అత్యుత్తమం. ఇక టీ20ల్లో వెస్టిండీస్కు ఇది వరుసగా ఎనిమిదో విజయం. అంతకుముందు 2012-13 ఏడాదిలో వరుసగా ఏడు విజయాలు సాధించిన తమ రికార్డును బ్రేక్ చేసింది.