హైదరాబాద్: వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది.
ఇక, 2019లో ఇంగ్లండ్లో జరిగే వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడంపై కూడా సందిగ్థత నెలకొంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న వెస్టిండిస్ వచ్చే వరల్డ్ కప్కు అర్హత సాధించాలంటే త్వరలో ఆడే మ్యాచ్లు ఎంతో కీలకం కానున్నాయి.

బుధవారం ఐర్లాండ్తో ఏకైక వన్డే ఆడనున్న వెస్టిండిస్ ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. ఈ మొత్తం ఆరు వన్డేల్లో నాలుగు మ్యాచ్ల్లో వెస్టిండిస్ విజయం సాధిస్తేనే వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు వన్డే ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీలంక ర్యాంకులపై ప్రభావం చూపుతుంది.
వెస్టిండిస్ గనుక నాలుగు మ్యాచ్లు గెలిస్తే, ర్యాంకింగ్స్లో శ్రీలంక ర్యాంకు దిగజారిపోతుంది. అదే సమయంలో వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని శ్రీలంక కోల్పోతుంది. ఇటీవల భారత్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో శ్రీలంక 5-0తో క్లీన్ స్వీప్ అవడం ఆ జట్టు ఆశల్ని సంక్లిష్టం చేసింది.
దీంతో వెస్టిండిస్ నుంచి శ్రీలంకకు గట్టి పోటీ ఏర్పడింది. వెస్టిండిస్ ఆడబోయే ఆరు మ్యాచ్ల్లో నాలుగు గెలవాల్సి ఉండటంతో ఇప్పుడు ఆ ఆశలన్నీ ఇటీవల వన్డే జట్టులో ఎంపికైన స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ పైనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టులో క్రిస్ గేల్కి చోటు కల్పించడం వరల్డ్ కప్ అర్హతను దృష్టి పెట్టుకునే జరిగిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
గతంలో వెస్టిండిస్ బోర్డుతో వివాదం కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు ఆ జట్టుకు దూరం కావాల్సి వస్తుంది. గత కొంతకాలంగా విండీస్ క్రికెట్ పరిస్థితి అంతకంతకూ దిగిజారిపోతున్న నేపథ్యంలో గేల్తో పాటు మార్లోన్ శామ్యూల్స్కు ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే వన్డే జట్టులో చోటు కల్పించారు. 2015 మార్చిలో చివరిసారిగా క్రిస్ గేల్ వెస్టిండిస్ తరుపున వన్డే ఆడాడు.