వార్నర్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్పై 2014 నుంచి వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడం ఇదే ప్రథమం. ఆల్రౌండ్ షోతో సత్తాచాటి దశాబ్దం తర్వాత బంగ్లాపై వన్డే సిరీస్ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు విండీస్ వరుసగా 11 వన్డేలు ఓడిపోవడం గమనార్హం.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్లా (62; 92 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తంజిద్ హసన్ (46; 33 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తంజిమ్ హసన్ షకిబ్ (45; 62 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ నాలుగు (4/22) వికెట్లు పడగొట్టాడు. మొటియ్ రెండు (2/36), మిండ్లే (1/45), షెఫార్డ్ (1/50), గ్రీవ్స్ (1/44), రోస్టన్ ఛేజ్ (1/18) తలో వికెట్ తీశారు.

బంగ్లాదేశ్ 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ మహ్మదుల్లా-తంజిమ్ హసన్ షకిబ్ ఎనిమిదో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో బంగ్లాదేశ్కు ఎనిమిదో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. కాగా, అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 36.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (82; 76 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఎవిన్ లూయిస్ (49; 62 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కార్టీ (45; 47 బంతుల్లో, 7 ఫోర్లు) రాణించారు.
షై హోప్ (17 నాటౌట్; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), రూథర్ఫర్డ్ (24 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద్ రాణా (1/36), రిషద్ హొస్సేన్ (1/53), అఫిప్ హొస్సేన్ (1/12) తలో వికెట్ తీశారు. కాగా, సిరీస్లో మిగిలిన నామమాత్రపు వన్డే గురువారం జరగనుంది.