మరమ్మతు అవసరం..
వెస్టిండీస్ జట్టు అంటే భారతీయులు సైతం అమితంగా ఇష్టపడతారు. కరేబియన్ క్రికెటర్లను అక్కున చేర్చుకుంటారు. టీమిండియాతో సమానంగా వారినీ ఆదరిస్తారు. అలాంటి క్రికెట్ జట్టు తన ప్రాభవాన్ని కోల్పోవడం పట్ల కొందరు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చాలాకాలం కిందటే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ దిశగా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.
క్రిస్ గేల్ మీద ఆధారపడొద్దు..అజరుద్దీన్
విధ్వంసక ఓపెనర్గా గుర్తింపు పొందిన క్రిస్ గేల్పై వెస్టిండీస్ క్రికెట్ జట్టు మొత్తం ఆధారపడుతోందని టీమిండియా మాజీ కేప్టెన్, హైదరాబాదీ మహమ్మద్ అజరుద్దీన్ అన్నారు. ఒకరిద్దరి మీద ఆధారపడటం సరైనది కాదని ఆయన చెప్పారు. క్రిస్ గేల్ను అవుట్ చేస్తే.. ఇక విండీస్ టీమ్ మొత్తాన్నీ అవుట్ చేసినట్టే అవుతందనే అభిప్రాయానికి అన్ని దేశాల క్రికెట్ జట్లు వచ్చాయని అన్నారు. గేల్ను అవుట్ చేయడానికి పక్కాగా ప్రణాళికలను రూపొందించుకున్నాయని, వాటిని అంతే పక్కాగా అమలు చేస్తున్నాయని చెప్పారు. ఫలితంగా- క్రిస్ గేల్ తొందరగా అవుట్ అవుతున్నాడని, దీని ప్రభావం మిగిలిన బ్యాట్స్మెన్లపై పడుతోందని అన్నారు. ఒక్కసారి గేల్ అవుటైన తరువాత వెస్టిండీస్ క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని నిలబడతారని తాను అనుకోవట్లేదని అన్నారు.
త్వరగా కోలుకుంటుందనే ఆశిస్తున్నా..
ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు గడ్డురోజులు నడుస్తున్నాయని అజరుద్దీన్ చెప్పారు. దీన్ని నుంచి త్వరగానే ఒడ్డున పడాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. వెస్టిండీస్ వంటి జట్టు బలహీనం కావడం క్రికెట్కు మంచిది కాదని చెప్పారు. విండీస్ తన సహజసిద్ధమైన ఆటతీరును కోల్పోయిందని, దీన్ని మళ్లీ సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని అజరుద్దీన్ అభిప్రాయపడ్డారు. భారత్ వంటి నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉన్న జట్టు ఎదురుపడితే కరేబియన్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నారని, ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని అజరుద్దీన్ అన్నారు. పేస్, స్పిన్ బౌలింగ్లను అద్భుతంగా ఎదుర్కొన్న బ్యాట్స్మెన్లు ఆ జట్టులో ఉండేవారని, ప్రస్తుతం దీనికి భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పారు.
రిషబ్ పంత్ తీసుకోవడం ఉత్తమం..
ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియా తన తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ను ఎదుర్కోబోతోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో విజయ్ శంకర్కు బదులుగా రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకోవాలని అజరుద్దీన్ సూచించారు. ఇంగ్లండ్పై ఆడిన అనుభవం రిషబ్ పంత్కు ఉందని, అక్కడి పిచ్లు అతనికి తెలుసని చెప్పారు. విజయ్శంకర్లో ప్రతిభ ఉన్నప్పటికీ.. అనుభవం లేకపోవడం వల్ల ఒత్తడికి గురవుతున్నాడని అన్నారు. దీని ప్రభావం అతని ఆటతీరుపై పడుతోందని, నాలుగో స్థానంలో విజయ్ శంకర్ను ఆడించడానికి మరికొంత సమయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు.