హైదరాబాద్: తమ దేశంలో క్రికెట్ మ్యాచ్లను ఆడించే దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్లో వెస్టిండీస్ జట్టు పర్యటించే అవకాశాలు కనబడుతున్నాయి.
వెస్టిండిస్ పర్యటనకు సంబంధించి పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నజమ్ సేథీ ప్రకటన చేశారు. పాకిస్థాన్లో పర్యటించేందుకు వెస్టిండిస్ జట్టుకు భద్రతాపరంగా ఓ నివేదికను పంపించామని, ఆ నివేదికపై వెస్టిండిస్ తన సంతృప్తిని వ్యక్తం చేసిందని తెలిపారు.
ఇటీవలే పాకిస్థాన్తో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వేదికగా వెస్టిండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్లను ఆడిన సంగతి తెలిసిందే. పాక్ పర్యటనకు వెస్టిండిస్ గనుక సంసిద్ధతను వ్యక్తం చేస్తే ఇరు జట్లు మార్చి 11 నుంచి 15 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్లను ఆడతాయి.
ఇదిలా ఉంటే పాక్లో రెండు ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడాలంటూ పీసీబీ విన్నవించిందని వెస్టిండిస్ క్రికెట్ మేనేజర్ రోలాండో హోల్డర్ తెలిపారు. ఇందుకు సంబంధించి అక్కడి భద్రతాపరమైన అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను అందజేసిందని ఆయన వివరించారు.

అయితే పాక్ ఇచ్చిన సెక్యూరిటీ ఆధారంగా అక్కడకు మా ప్రతినిధిని ఒకర్ని పంపిస్తున్నాం. ఆ తర్వాత మాత్రమే పాక్లో సిరీస్ పై నిర్ణయం తీసుకుంటామని, ఇక్కడ మా ఆటగాళ్ల భద్రతోపాటు, సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని ఆయన తెలిపారు.
ముఖ్యంగా మ్యాచ్లు జరిగే స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. భద్రతపరంగా ఎటువంటి ఇబ్బంది లేకపోతనే పాక్లో వెస్టిండిస్ జట్టు పర్యటిస్తుందని హోల్డర్ తెలిపారు.
ఇదిలా ఉంటే పాక్లో సెక్యూరిటీపై వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండీ రస్సెల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న రస్సెల్ ఆ దేశంలో ఆడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని అన్నాడు. మరోవైపు వెస్టిండిస్ మాజీ కెప్టెన్ డారెన్ స్వామీ కూడా పాక్లో పర్యటనపై సందిగ్థత వ్యక్తం చేశాడు.