భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో వెస్టిండీస్ జట్టు ఆడటం లేదు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో వరుసగా పసికూనల చేతిలో ఓటములు ఎదుర్కొన్న విండీస్ జట్టు వరల్డ్ కప్ పోటీ నుంచి నిష్క్రమించింది. తొలుత జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన విండీస్.. ఆ తర్వాత నెదర్లాండ్స్ చేతిలో కూడా ఓటమి చవిచూసింది.
జింబాబ్వే మ్యాచ్లో 268 పరుగులు ఛేజ్ చేయడంలో విండీస్ విఫలమైంది. కేవలం 233 పరుగులు మాత్రమే చేసి 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది చూసిన అందరూ విండీస్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ ఆ టీం బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది.

దీంతో నెదర్లాండ్స్ కూడా 374 పరుగులు చేసింది. చివర్లో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ ఓవర్లో నెదర్లాండ్స్ 31 పరుగులు చేయగా.. విండీస్ కేవలం రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులే చేయగలిగింది. దీంతో విండీస్ ఓటమిపాలైంది. ఇక తాజాగా స్కాట్లాండ్ చేతిలో కూడా విండీస్ ఘోరమైన ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో కూడా విండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఈ మ్యాచ్లో జేసన్ హోల్డర్ (45), రొమేరియో షెపర్డ్ (36), బ్రాండన్ కింగ్ (22), నికోలస్ పూరన్ (21) ఫర్వాలేదనిపించారు. మిగతా ఎవరూ కనీసం పోరాడలేదు. ప్రధాన బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 43.5 ఓవర్లలో కేవలం 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ ఈజీగా ఛేజ్ చేసేసింది.
స్కాట్లాండ్ ఓపెనర్ మాథ్యూ క్రాస్ (74 నాటౌట్) పరుగులతో రాణించాడు. మూడో స్థానంలో వచ్చిన బ్రాండన్ మాక్ములెన్ (69) కూడా ఆకట్టుకున్నాడు. దీంతో స్కాట్లాండ్ నిలకడగా లక్ష్యం దిశగా సాగింది. చివర్లో కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (13 నాటౌట్)తో కలిసి క్రాస్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ ఓటమితో వరల్డ్ కప్కు విండీస్ అర్హత సాధించలేకపోయింది. రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఈ జట్టు ఇలా వెనుక పడిపోవడం చూసిన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అంతకుముందు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2022 టీ20 వరల్డ్ కప్కు కూడా విండీస్ అర్హత సాధించడంలో విఫలమైంది. టీంలో పూరన్, హోల్డర్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా ఆ జట్టు పసికూన చేతిలో ఓడిపోవడం గమనార్హం.