IND vs WI: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసేసరికి పరిస్థితి ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు, వెస్టిండీస్ను 248 పరుగులకే ఆలౌట్ చేసింది. దీనితో భారత్కు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయం మేరకు వెస్టిండీస్కు ఫాలోఆన్ ఇవ్వబడింది. అయితే ఫాలోఆన్లో బరిలోకి దిగిన విండీస్ టీమ్, భారత బౌలింగ్కు గట్టి జవాబిచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి, వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ భారత్ కంటే కేవలం 97 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో మ్యాచ్ నాలుగో రోజుకు చేరింది.
తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ మాయాజాలం
రెండో ఇన్నింగ్స్లో విండీస్ పోరాటానికి ముందు తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్తో వెస్టిండీస్ ఇన్నింగ్స్ను కూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. కుల్దీప్ అద్భుతంగా రాణించి 5 వికెట్ల హాల్ సాధించాడు. వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ను 4 వికెట్లకు 140 పరుగుల నుంచి ప్రారంభించగా, ఆట మొదలైన అరగంటలోనే కుల్దీప్ తన స్పెల్ మొదలుపెట్టి షాయ్ హోప్ను (36) అద్భుతమైన బంతితో బౌల్డ్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. కుల్దీప్ ఆ తర్వాత టెవిన్ ఇంలాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఆఖరి వికెట్గా జైడెన్ సీల్స్ను అవుట్ చేసి టెస్ట్ కెరీర్లో 5వ సారి 5 వికెట్ల హాల్ పూర్తి చేసుకున్నాడు.

మహమ్మద్ సిరాజ్ జోమెల్ వారికన్ను ఔట్ చేయగా.. బుమ్రా ఖారీ పియరీని అవుట్ చేశాడు. పియరీ (23), అండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్) కలిసి 9వ వికెట్కు 46 పరుగులు జోడించి విండీస్ ఇన్నింగ్స్ను కొంతవరకు పొడిగించారు.
ఫాలోఆన్లో విండీస్ ప్రతిఘటన
తొలి ఇన్నింగ్స్లో 270 పరుగుల భారీ లోటుతో ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్లో మెరుగైన ప్రదర్శన చేసింది. టీ సమయానికి విండీస్ 2 వికెట్లకు 35 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మహ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ బాల్కు తేజ్నారాయణ్ చంద్రపాల్ (10) పుల్ షాట్కు యత్నించి, శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే, ఎలిస్ అతానాజేను (7) వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆఫ్-స్పిన్తో బోల్తా కొట్టించాడు.
అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు భారత బౌలర్లను నిలువరించారు. దీంతో ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ స్కోరు 173/2 కి చేరి, భారత్కు గట్టి సమాధానం ఇచ్చింది. భారత్ కేవలం 97 పరుగుల ఆధిక్యంలో ఉండగా, నాలుగో రోజు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలక రోజు కానుంది.