
హైదరాబాద్: వెస్టిండిస్ క్రికెటర్ అల్జారి జోసెఫ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అంటిగ్వాలో ఇంగ్లాండ్, విండీస్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుండగా మూడో రోజు ఉదయం ఆట ఆరంభానికి ముందే తన తల్లి షరోన్ మరణించింది. మ్యాచ్ను మధ్యలోనే వదిలేసి అతడు తల్లి అంత్యక్రియల కోసం వెళ్తాడని భావించారు.
కానీ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఉబికి వస్తోన్న కన్నీటిని 22 ఏళ్ల జోసెఫ్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ మ్యాచ్ ఆడాడు. మూడో రోజు బ్యాటింగ్కు కూడా దిగాడు. ఆటలో భాగంగా రెండు జట్ల ఆటగాళ్లు చేతికి నల్ల ఆర్మ్బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. అయితే, మిగతా రెండు రోజుల ఆటకు జోసెఫ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియరాలేదు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఈ టెస్టు సిరిస్లో జోసెఫ్ 5 వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్ తల్లి మరణం పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తొలి టెస్టులో వెస్టిండీస్ 381 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 187 పరుగులకు ఆలౌటైంది.
డారెన్ బ్రేవో (216 బంతుల్లో 50; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో నిలవడంతో రెండో టెస్టులో విండిస్కు తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభించింది. అతనికి డౌరిచ్ (31), కెప్టెన్ హోల్డర్ (22) సహకరించడంతో మూడో రోజు లంచ్ విరామానికి ముందు విండీస్ 306 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్లు బ్రాత్వైట్ (49), కాంప్బెల్ (47), షైహోప్ (44) పరుగులతో రాణించారు. దీంతో ఆతిథ్య జట్టుకు 119 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.