ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అన్ని దేశాల క్రికెటర్లు వచ్చి ఆడుతున్నా వెస్టిండీస్ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని అనేకమంది విమర్శలు చేస్తున్నారని విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో వాపోయాడు. డబ్బుల కోసం జాతీయ జట్టును వదిలేస్తున్నామనే ఆరోపణ చాలా బాధ కలిగిస్తోందని చెప్పాడు.
ఆటను అస్వాదించడమే తన విజయ రహస్యమని తెలిపాడు. ఏ జట్టు కోసం ఆడినా వందశాతం కష్టపడుతూ ఆటను అస్వాదిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఫలితాలు సానుకూలంగా వస్తాయని చెప్పాడు. ప్రతీ ఆటగాడికి తమ జాతీయ జట్టుకు ఆడాలనే కోరిక ఉంటుందని తెలిపాడు. తమకూ అలాగే ఉంటుందని చెప్పాడు.
తనతోపాటు విండీస్ క్రికెటర్లు అయిన క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్లపై చాలా ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. డబ్బుల కోసమే తమ జాతీయ జట్టుకు కూడా ఆడకుండా ఐపిఎల్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారని తెలిపాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా తమతోపాటు ఐపిఎల్ ఆడుతున్నప్పటికీ.. తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు రావడం బాధగా ఉందని పేర్కొన్నాడు.

ఉత్తమ ట్వంటి20 అవార్డు అందుకున్న సందర్భంగా డ్వేన్ బ్రేవో పలు అంశాలపై స్పందించాడు.
అయితే ఆరోపణలు, విమర్శలను పట్టించుకోమని... ఇక్కడ తమకు గౌరవం, అభిమానం, ఆదరణ లభిస్తోందని అందుకే ఐపిఎల్ ఆడుతున్నామని చెప్పాడు. తమకు తమ ఇంటి తర్వాత భారతదేశం మరో ఇల్లులా ఆదరిస్తోందని తెలిపాడు. తాను ఇటీవల ఇక్కడ ఒక ఆల్బమ్ కూడాచేశానని తెలిపాడు.
తమ జాతీయ క్రికెట్ బోర్డ్ ఆటగాళ్ల పట్ల అంత శ్రద్ధ చూపడం లేదని చెప్పాడు. ఐపిఎల్తో ఉన్న సంబంధాలు కూడా బోర్డుతో లేవని తెలిపాడు. అయితే తమ దేశ క్రికెట్ బోర్డు గురించి ఎక్కువగా మాట్లాడనని తెలిపాడు. తాను మొదట ముంబై ఇండియన్స్ తరపున ఆడినట్లు చెప్పాడు. తాను ఆ జట్టుకు రుణపడి ఉంటానని తెలిపాడు.
తనకు వారు తొలి అవకాశమిచ్చారని తెలిపాడు. వారితో తనకు సన్నిహిత బంధాలున్నాయని తెలిపిన బ్రేవో.. హర్భజన్ సింగ్ తన ఆప్త మిత్రుడని చెప్పాడు. తన బాబీ(ముంబై ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ)తో ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపాడు. ప్రస్తుతం బ్రేవో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.