
వెస్టిండీస్ ప్లేయర్ దినేష్ రామ్దిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఒక రోజు కూడా కాకున్న ముందే.. ఆ జట్టు మరో సీనియర్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో కాదు లెండల్ సిమన్స్. అతను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. 37ఏళ్ల సిమన్స్ గతేడాది టీ20 ప్రపంచకప్లో చివరి సారిగా వెస్టిండీస్ తరపున ఆడాడు. మాజీ వెస్టిండీస్ క్రికెటర్, కోచ్ అయిన ఫిల్ సిమన్స్ మేనల్లుడు లెండల్ సిమన్స్. 2006లో ఫైసలాబాద్లో పాకిస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో సిమన్స్ అరంగేట్రం చేశాడు. అయితే రెగ్యులర్ ప్లేయర్గా కావడానికి చాలా ఏళ్లు కష్టపడ్డాడు.
ఇకపోతే ఐపీఎల్లో సిమన్స్ ముంబై ఇండియన్స్ తరఫున రాణించాడు. 2015లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఐపీఎల్ సీజన్లో 45సగటుతో 540పరుగులు చేసి ముంబై తరఫున టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ తదితర ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. ఇక 2016లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో భారత్తో జరిగిన మ్యాచ్లో తొలుత ఇండియా 193పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్కు నిర్దేశించింది. ఇక సిమన్స్ 51బంతుల్లో అజేయంగా 82పరుగులు చేసి ఆ మ్యాచ్ గెలిపించాడు. ఆ మ్యాచ్ ఇప్పటికీ సిమన్స్ కెరీర్లో మరుపురాని మ్యాచ్ అని చెప్పుకోవాలి.
ఇకపోతే కెరీర్ విషయానికొస్తే సిమన్స్ టెస్టుల్లో 8మ్యాచ్లు ఆడి 276పరుగులు చేశాడు. వన్డేల్లో 68 మ్యాచ్లు ఆడి 1958పరుగులు చేశాడు. అందులో 2సెంచరీలు 16హాఫ్ సెంచరీలున్నాయి. ఇక టీ20ల్లో 68 మ్యాచ్లలో 1527పరుగులు చేశాడు. 9 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్లో 29 మ్యాచ్లు ఆడి 1079పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 11హాఫ్ సెంచరీలున్నాయి.