
ముంబై: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. పొలార్డ్ తండ్రి మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పొలార్డ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మీరు అక్కడ బాగున్నారని నాకు తెలుసు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న కొన్ని ఫొటోలను పొలార్డ్ షేర్ చేశాడు. ఐపీఎల్ 2019 విన్నర్స్ ట్రోఫీతో ఉండగా.. తీసిన ఫొటోను కూడా అతడు పోస్ట్ చేశాడు.
'ప్రశాంతంగా విశ్రమించండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. ఎన్నో హృదయాలను మీరు గెలుచుకున్నారు. ఇక ముందు కూడా మిమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉంటా. టాల్ బాయ్ ఇకలేరు. మీరు ఏదో ఒకచోట విశ్రాంతి తీసుకుంటారని నాకు తెలుసు' అంటూ కీరన్ పొలార్డ్ భావోద్వేగ పోస్ట్ చేశాడు. పొలార్డ్ తండ్రి మరణం పట్ల చాలా మంది క్రికెటర్లు ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ముంబై సభ్యులు సచిన్ టెండుల్కర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు పొలార్డ్కు సానుభూతి ప్రకటించారు.
'మీ నాన్న గారు మరణించారన్న విషయం ఇప్పుడే తెలిసింది. చాలా బాధగా ఉంది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి. ఆయన ఆత్మకు శాంతికలగాలి' అని ట్విటర్ వేదికగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సంతాపం వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ మెంటర్గా ఉన్న విషయం తెలిసిందే. ఇక కీరన్ పొలార్డ్ ముంబైలో కీలక ఆటగాడు.
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీరన్ పొలార్డ్ కెప్టెన్గా ఉన్నాడు. పొలార్డ్ వెస్టిండీస్ తరఫున 116 వన్డేలు, 79 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2564, టీ20ల్లో 1277 పరుగులు చేశాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా ఏళ్లుగా ఆడుతున్నాడు. ఇప్పటికే ముంబైకి 100కు పైగా మ్యాచులు ఆడాడు. 164 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో పొలార్డ్ 3023 పరుగులు, 60 వికెట్లు తీశాడు. ఐపీఎల్-14వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు జరుగనుంది.