కోల్కతా: తమ జట్టును భారత్ పంపించేందుకు తాము ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నామని, అలాంటప్పుడు.. ఎంత కప్పు గెలిచినంత మాత్రాన బోర్డు పైన విండీస్ కెప్టెన్ డారెన్ సామీ ఇలా మాట్లాడటం బాధించిందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంగ్లాండు పైన ప్రపంచ కప్ ట్వంటీ 20లో డారెన్ సామి సేన గెలుపొందిన విషయం తెలిసిందే. కప్ గెలిచిన అనంతరం డారెన్ సామీ విండీస్ బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై విండీస్ బోర్డు వెంటనే స్పందించింది. పోటీలో గెలిచినంత మాత్రాన అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదని హితవు పలికింది.

తమ దేశ బోర్డు తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని, సరైన దుస్తులు లేవని, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు వచ్చామని సామి చెప్పాడు. టీమ్ మేనేజర్ గా ఉన్న వావ్లే లీవిస్ గతంలో ఏ జట్టుతోను పని చేయలేదని, అనుభవం లేని వ్యక్తని ఎంపిక చేసి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడని విమర్శించాడు.
తమకు దేశాధినేతల నుంచి ఫోన్లు వచ్చినా, బోర్డు నుంచి ఎలాంటి సందేశం రాలేదన్నాడు. సమీ ఈ ఆరోపణలు చేసిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసింది. ప్రపంచ కప్ ట్వంటీ 20 పోటీలను విజయవంతంగా నిర్వహించిన బిసిసిఐకి అభినందనలు తెలిపింది.
డారెన్ సామీ వ్యాఖ్యలపై వెస్టిండీస్ ప్రజలందరి తరఫునా క్షమాపణలు కోరుకుంటున్నామని, దేశంలోని ప్రజలంతా తమ దేశం గెలవాలని కోరుకుందని పేర్కొంది. భారత్కు తమ జట్టును పంపేందుకు వ్యయ ప్రయాసలకు ఓర్చామని, సామీ ఎందుకలా మాట్లాడాడో కనుక్కుంటామని పేర్కొంది.