బ్రిడ్జ్టౌన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మాన్ పావెల్ విశ్వరూపం చూపించాడు. సెంచరీతో ఆంగ్లేయ బౌలర్లను ఊచకోత కోశాడు. తన సెంచరీ విధ్వంసంలో పావెల్ ఏకంగా 10 సిక్స్లు బాదడం గమనార్హం. దీనికి తోడుగా పూరన్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి బౌలర్లు కూడా తోడవడంతో మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 48 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూరన్, పావెల్ మూడో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏకంగా 122 పరుగులు జోడించారు. జట్టు స్కోర్ 170 పరుగుల వద్ద ఉండగా 70 పరుగులతో చెలరేగిన పూరన్ ఔట్ అయ్యాడు. పూరన్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి.
.@Ravipowell26 transformed into a six-hitting supernova during his 107-run knock, smashing as many as 1️⃣ 0️⃣ sixes! 💥
— FanCode (@FanCode) January 27, 2022
Relive this gem of an innings from the West Indian batsman on #FanCode 👉 https://t.co/dANvRWVoQS#WIvENG #RovmanPowell @windiescricket @englandcricket pic.twitter.com/i6bULgpCK6
అనంతరం రొమారియో షెపర్డ్తో జత కట్టిన పావెల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విశ్వరూపం చూపించిన పావెల్ సెంచరీ సాధించాడు. 10 సిక్స్లు, 4 ఫోర్లతో 53 బంతుల్లోనే 107 పరుగులతో చెలరేగాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పావెల్కు ఇదే తొలి సెంచరీ. జట్టు స్కోర్ 210 పరుగుల వద్ద ఉండగా నాలుగో వికెట్ రూపంలో ఔటయ్యాడు. కాగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా బాగానే పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ టామ్ బాంటన్ 3 ఫోర్లు, 6 సిక్స్లతో 39 బంతుల్లోనే 73 పరుగులతో చెలరేగాడు. అతనికి ఫిలిప్ సాల్ట్ కూడా హాఫ్ సెంచరీతో సహకరించాడు. ఫిలిప్ 3 ఫోర్లు, 5 సిక్స్లతో 24 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు.
లక్ష్యం భారీగా ఉండడానికి తోడు మిగతా బ్యాటర్లెవరూ సహకరించకపోవడంతో ఇంగ్లీష్ జట్టు టార్గెట్ను అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసి చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్పై విండీస్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రొమారియో షెపర్డ్ 3, కీరన్ పోలార్డ్ 2, హుస్సేన్, కాట్రెల్, జేసన్ హెల్డర్ తలో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన పావెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అటు ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ 2-1తో అధిక్యంలో నిలిచింది.