వెస్టిండీస్ వేదికగా ఇటీవల ముగిసిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని యువ భారత్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి యువ భారత్ జగజ్జేతగా నిలిచింది. అయితే ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టే క్రమంలో యువ భారత జట్టు ఎదుర్కొన్న అవమానకర సంఘటన ఒకటి ప్రస్తుతం బయటికి వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేని కారణంగా ఏడుగురు భారత క్రికెటర్లను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారని జట్టు మేనేజర్ లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తాజాగా వెల్లడించాడు. భారత్లో టీనేజీ కుర్రాళ్లకి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఎంత వివరించినా ఇమిగ్రేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆయన తెలిపాడు.
ఏకంగా ఓ రోజు మొత్తం ఎయిర్పోర్టులోనే ఉంచారని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఏడుగురు ఆటగాళ్లను తర్వాతి ఫ్లైట్కే భారత్కు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించారని చెప్పుకొచ్చాడు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు వారిని విండీస్ గడ్డపై అడుగుపెట్టనిచ్చేది లేదని ఎయిర్పోర్టు అధికారులు హెచ్చిరించినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్టు అధికారులు అడ్డుకున్న ఏడుగురిలో భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రవికుమార్, రఘువంశీ తదితరులు ఉన్నట్లు లోబ్జాంగ్ జీ టెన్జింగ్ వివరించారు.
24 గంటల తర్వాత ఐసీసీ, బీసీసీఐ అధికారుల చొరవతో ఎయిర్పోర్టు అధికారులు వెనక్కి తగ్గినట్టు చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ జరగనున్న గయానాకు ఆటగాళ్లు చేరుకున్నారని లోబ్జాంగ్ జీ టెన్జింగ్ తెలిపారు. కాగా ప్రపంచకప్లో టీమిండియా రెండు మ్యాచ్లు ఆడిన అనంతరం జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిని పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో కీలక ఆటగాళ్లైనా కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఆరాధ్య యాదవ్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిలోని పలువురు కూడా కరోనా బారినపడ్డారు. అయితే ఆటగాళ్లు కరోనా బారినపడినప్పటికీ కీలక ప్లేయర్లు లేకుండా లీగ్లో మిగతా మ్యాచ్లు ఆడిన యువ భారత జట్టు అదిరిపోయే విజయాలతో నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. నాకౌట్ పోరులో కరోనా నుంచి కోలుకున్న ఆటగాళ్లంతా జట్టులో చేరారు. చివరకు ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి టీమిండియా అండర్ 19 జట్టు రికార్డు స్థాయిలో ఐదో సారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.