దులీప్ ట్రోఫీకి స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 5 నుంచి మొదలుకానున్న ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్కు రోహిత్, కోహ్లితో పాటు బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే గత కొన్నాళ్లుగా ఈ స్టార్ ఆటగాళ్లకు ఎంతో విశ్రాంతి లభించిందని దులీప్ ఆడాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ తలపడనుంది. అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్లు తర్వాత ఈ ఏడాది నవబంర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

వరుసగా టెస్టు సిరీస్లు ఉండటంతో ఈ స్టార్ ఆటగాళ్లకు పనిభారం దృష్ట్యా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో వాళ్లు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ గణాంకాలను వివరిస్తూ ఎంతో విశ్రాంతి లభించిందని చెప్పాడు. దులీప్ ట్రోఫీ ఆడాలని ట్వీట్ చేశాడు.
''గత అయిదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వాటిలో రోహిత్ శర్మ 59 శాతం ఆడాడు.విరాట్ కోహ్లి 61 శాతం మ్యాచ్లు ఆడాడు. ఇక బుమ్రా 34 శాతం మ్యాచ్లు ఆడాడు. వాళ్లకు ఎంతో విశ్రాంతి లభించింది. దులీప్ ట్రోఫీకి వాళ్లు ఎంపికై ఉండాల్సింది'' అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
కాగా, వచ్చే ఏడాది ఆగష్టులోపు భారత్ 15 టెస్టులు ఆడనుంది. దాంతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల పట్ల జాగ్రత్త తీసుకుంటే తప్పేంటని మంజ్రేకర్ ట్వీట్ను నెటిజన్లు తప్పుపడుతున్నారు. గేమ్ ఛేంజర్లను అవసరైన సందర్భాల్లో ఉపయోగిస్తేనే భారత క్రికెట్కు మంచిదని అభిప్రాయపడుతున్నారు.