కోల్కతా: గెలుపోటములు జీవితంలో భాగమని, టోర్నీ ఆరంభం నుండి భారత జట్టు బాగా ఆడిందని, భారత జట్టును చూసి తామంతా గర్వపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. టీమిండియా బాగా ఆడిందని, వచ్చే ప్రపంచ కప్లో మన జట్టే విజేతగా నిలవాలని ఆశిస్తున్నానని, అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు అభినందనలు అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆన్నారు.
ప్రపంచ కప్లో భారత్ గొప్పగా ఆడిందని, ఆస్ట్రేలియాతో మ్యాచ్ కఠినంగా సాగిందని, ఓటమిని తట్టుకోవడం ఎప్పుడూ కష్టమేనని, కానీ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని సచిన్ టెండుల్కర్ అన్నాడు. మీ ఆటతో అభిమానులను అలరించారన్నారు.
ఈ టోర్నోలో భారత్ అద్భుతంగా ఆడిందని, కానీ సహచరులకు చివరకి నిరాశ మిగిలిందని యువరాజ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు చెదిరేలా ఆడిన ఆస్ట్రేలియా ఫైనల్ చేరడానికి అర్హమైందన్నాడు. ఈ ప్రపంచ కప్లో ఓడిపోని జట్టుంటూ ఉందా, ఇంతటితో ఏమీ కాలేదని, మళ్లీ వస్తామని అమితాబ్ బచ్చన్ అన్నాడు.
సెమీ ఫైనల్లో ఓడినా, ఈ టోర్నీ ఆసాంతం భారత్ ఆటతీరు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని, సెమీస్లో ఆసిస్ బాగా ఆడి గెలిచిందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
ట్విట్టర్లో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈసారి క్రికెట్పై తన బాణాలు ఎక్కుపెట్టాడు. క్రికెట్ను విపరీతంగా ద్వేషించే రామ్ గోపాల్ వర్మ.. భారత్ ఓటమి నాకు చాలా ఆనందం కలిగించిందని, ఎందుకంటే నాకు క్రికెట్ అంటే ఇష్టముండదని, క్రికెట్ను అభిమానించేవారంటే అస్సలు ఇష్టం ఉండదని ట్వీట్ చేశాడు.
అలాగే క్రికెటైటిస్ అనే వ్యాధి నుంచి నా దేశ ప్రజలను కాపాడమని అందరి దేవుళ్లనీ ప్రార్థిస్తున్నానని మరో కామెంట్ చేశాడు. క్రికెట్ ఆడడం ఆపేంత వరకు భారత్ను అన్ని దేశాలు ఓడిస్తూనే ఉండాలి, ఆల్కహాల్, సిగరెట్లకు బానిసలైతే ఆ వ్యక్తే నష్టపోతాడని, కానీ క్రికెట్కు బానిసలైతే జాతి మొత్తం నిర్వీర్యమైపోతుందని ఘాటుగా విమర్శించాడు.