లండన్: ఆదివారం సెలవురోజు. అందరూ టీవీలకు అతుక్కుని పోయే రోజు. మరే ఇతర ఛానల్ను ట్యూన్ చేయడానికీ ఏ మాత్రం ఇష్ట పడని సందర్భం. కారణం- దాయాదుల పోరు. ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా- ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠ సమయంలోనూ క్రికెట్ ప్రేమికులను కలవరపాటుకు గురవుతున్నారు. వర్షం కారణంగా ఇప్పటికే అయిదు మ్యాచ్లు రద్దు అయ్యాయి. భారత్-పాక్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్పై వరుణ దేవుడు కరుణ చూపుతాడా? లేదా? అనే అంశం అభిమానులను ఆందోళనకు కారణమౌతోంది.
వర్షం పడే అవకాశాలు ఉన్నాయట
దాయాదుల పోరుకు వేదికగా మారిన మాంచెస్టర్ సిటీలో ఆదివారం వర్షం పడే అవకాశాలు ఉందని అక్యుట్ వెదర్ చెబుతోంది. శనివారం రాత్రి తేలిక పాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలిక పాటి జల్లుల స్థాయి నుంచి ఓ మోస్తరు వర్షం పడొచ్చని అక్యుట్ వెదర్ అంచనా వేసింది. ఆదివారం నాడు మాంచెస్టర్ సిటీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావడంతో పాటు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
వరుణుడి కరుణ ఉంటుందా?
టీమిండియా ఆడుతున్న మ్యాచ్ అంటే.. జట్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి మ్యాచ్ కూడా నీళ్లపాలైంది. శుక్రవారం నాటింగ్హామ్లో న్యూజీలాండ్తో కొనసాగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. మ్యాచ్ మొత్తాన్నీ కవర్ చేసేశాడు వరణ దేవుడు. ప్రపంచకప్ ఆరంభమైనప్పటి నుంచి అయిదు మ్యాచ్లు వర్షం పాలయ్యాయి. నాటింగ్ హామ్ మ్యాచ్లో టీమిండియా ప్రత్యర్థి కివీస్ కదా అని సరిపెట్టుకోవచ్చు. ఆదివారం నాటి మ్యాచ్పైనే అందరి దృష్టీ నిలిచింది. ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డు పడకూడదని కోరుకోని భారతీయుడు ఉండకపోవచ్చు.
{headtohead_cricket_3_5}