భారత్-ఇంగ్లండ్ సుదీర్ఘ సిరీస్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అయిదు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. గురువారం నుంచి ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ధర్మశాలలో వాతావరణ పరిస్థితులు భారత్ కంటే ఇంగ్లండ్కు అనుకూలంగా ఉంటాయని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇటీవల ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20లో టీమిండియా ఆటగాళ్లు చలిలో తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. డ్రింక్స్ బ్రేక్లో వేడినీటి బ్యాగ్లపై అరచేతులు ఉంచి చలిని ఎదుర్కొన్నారు.

కాగా, వాతావరణశాఖ ప్రకారం ధర్మశాల టెస్టు ప్రారంభమయ్యే గురువారం రోజు ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చు. అంతేగాక మొదటి రెండు రోజుల పాటు తేలిక పాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు 82% ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. రెండు, మూడు, నాలుగు రోజుల్లో కాస్త ఉష్ణోగ్రత పెరగవచ్చు. తిరిగి ఆట చివరిరోజు వరుణుడు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులన్నీ తమ స్వదేశంలో ఆడుతున్నట్లుగా ఇంగ్లండ్కు అనుభూతి కలిగిస్తుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్లో ప్రతి మ్యాచ్ కీలకమని రోహిత్ సేనకు సూచించాడు. ఫైనల్కు అవకాశాలు మెరుగుపర్చుకోవాంటే ఆఖరి టెస్టును తేలిక తీసుకోవద్దని తెలిపాడు.
''సిరీస్లో మరో టెస్టు మాత్రమే మిగిలి ఉంది. ధర్మశాల పరిస్థితులు టీమిండియా కంటే ఇంగ్లండ్కే సానుకూలంగా ఉంటాయి. తమ సొంతగడ్డపై ఆడుతున్న అనుభూతి ఇంగ్లండ్కు కలిగేలా ధర్మశాల పరిస్థితులు ఉంటాయి. బంతి గాల్లోనే స్వింగ్ చేసేలా చూడాలి. పిచ్కు తగ్గట్లుగా స్పందిస్తూ బౌలింగ్ చేయాలి. అయితే ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి టెస్టును కాస్త తేలిక తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ పాయింట్లు కీలకమని గుర్తుంచుకోవాలి''అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.