న్యూజిల్యాండ్తో జరిగిన తొలి వన్డేలో ఉత్కంఠ భరిత విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచుతోనే సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం రాయ్పూర్ వేదికగా జరిగే రెండో వన్డే కోసం గట్టిగా రెడీ అవుతోంది. పలువురు కీలక ఆటగాళ్లు జట్టులో లేకపోయినా కూడా భారత్ను ఓడించినంత పని చేసిన కివీస్ జట్టు.. రెండో వన్డేలో అయినా నెగ్గి తమ సత్తా చూపించుకోవాలని అనుకుంటోంది. మరి రాయ్పూర్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్డే ఆడనున్నాయి. ఇక్కడ వర్షం పడే అవకాశం అయితే ఏమాత్రం లేదని తెలుస్తోంది. ప్రేక్షకులు పూర్తి 100 ఓవర్ల ఆటను ఆస్వాదిస్తారు. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత కూడా 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుందని నిపుణుల అంచనా. అయితే సాయంత్రం చీకటి పడిన తర్వాత నెమ్మదిగా మంచు ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. కివీస్, భారత్ ఆడే మ్యాచ్ తొలి అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఇక్కడ జరిగిన కొన్ని ఐపీఎల్, సీఎల్టీ20 మ్యాచ్ ఫలితాలను గమనిస్తే.. ఈ పిచ్ నుంచి పేసర్లకు, స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తుంది. దేశంలో మంచి బ్యాలెన్స్డ్గా ఉండే పిచ్లలో ఇదొకటి.
పిచ్ అలాగే బౌలర్లకు సహకారం అందిస్తే 240-250 పరుగుల మ్యాచ్ జరగొచ్చు. అదే బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ తయారు చేస్తే స్కోరు ఎంత దూరం పోతుందో చెప్పడం కష్టం. అంతేకాదు, తొలి వన్డేలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్లో అయినా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.