సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్తో మంగళవారం జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలగడంతో కుదించిన ఈ మ్యాచ్ లో అయిదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా సత్తాచాటింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడుతూ వరుణుడు రాక తమకు కలిసొచ్చిందని అన్నాడు.
''డర్బన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అప్పుడు నిరాశ చెందాం. కానీ ఇవాళ మ్యాచ్ లో ఎంతో మంది అభిమానులను చూడటం ఆనందంగా ఉంది. వారి ముందు విజయం సాధించడం చాలా గొప్పగా ఉంది. అయితే మొదట్లో వికెట్ స్లోగా ఉంది. కానీ వరుణుడి రాకతో పరిస్థితి మారిపోయింది. వర్షమే మాకు కలిసొచ్చింది''

''మా బౌలర్లు ఎంతో శ్రమించి రాణించారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హెండ్రిక్స్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్ లో నాయకుడిగా అదరగొట్టాడు. ప్రపంచకప్ కోసం ప్లేయర్లను సెలక్ట్ చేయాల్సి ఉంది. సెలక్షన్ దృష్టిలో కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్లేయర్ తమ అత్యుత్తమ ఆట కనబరుస్తున్నాడు. టీమ్ లో ఈ ఆరోగ్యవంతమైన పోటీ శుభసూచకం'' అని మార్క్రమ్ అన్నాడు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (68*), సూర్యకుమార్ యాదవ్ (56) అర్ధశతకాలు సాధించారు. తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు.
దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. హెండ్రిక్స్ (49), మార్క్రమ్
(30) రాణించారు. టీమిండియా బౌలర్లలో ముఖేశ్ రెండు వికెట్లు, కుల్ దీప్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. సిరీస్ లో ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.