దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ను వదిలిపెట్టి దాదాపు నాలుగేళ్లు అయినా క్రికెట్ ప్రపంచంలో అతనికి క్రేజ్ ఇప్పటికీ తగ్గట్లేదు. ఆఖరి ఓవర్లలో అసాధ్యమైన పరుగులు చేయాల్సిన ప్రతి సందర్భంలో అందరికీ ఇప్పటికీ గుర్తు వచ్చేది ధోనీనే. ఆ రీతిలో జట్టును విజయతీరాలకు చేర్చుతూ 'బెస్ట్ ఫినిషర్'గా నిలిచాడు ధోనీ. అయితే తాజాగా వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ మహీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి వరకు తాను క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించడానికి ధోనీ చెప్పిన సలహానే కారణమని అన్నాడు.
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించడంలో కూడా విఫలమైన వెస్టిండీస్.. ప్రస్తుతం ఇంగ్లాండ్తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అయితే సిరీస్లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (71), క్రాలే (48), సాల్ట్ (45) రాణించారు. విండీస్ బౌలర్లో షెఫార్డ్, మొటెయ్, ఒషానె థామస్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం భారీ ఛేదనకు దిగిన వెస్టిండీస్ 48.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హోప్ అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 83 బంతుల్లోనే 109 పరుగులు చేసిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టి తాను కూల్గా బ్యాటింగ్ చేసి గెలిపించాడు.
అయితే అవార్డు అందుకున్న అనంతరం హోప్ తన సూపర్ ఇన్నింగ్స్కు ధోనీ పరోక్ష కారణమని వివరించాడు. ''గతంలో ధోనీతో ఒకసారి మాట్లాడాను. క్రీజులో ఎంతసేపు ఉండాలని భావిస్తావో దానికంటే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించమని చెప్పాడు. ఆ సలహాతోనే ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచి విజయం సాధించాం'' అని ధోనీ గురించి హోప్ మాట్లాడాడు. ఇదే ఉత్సాహంతో రెండో వన్డేలోనూ ఆడి సిరీస్ను సాధిస్తామని హోప్ అన్నాడు. మ్యాచ్లో కొన్ని క్యాచ్లు జారవిడిచామని, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాడు. తమ జట్టు ఓపెనర్లు అథెంజే (66),బ్రాండన్ కింగ్ (35) గొప్పగా ఆడి శుభారంభాన్ని ఇచ్చారని పేర్కొన్నాడు. విండీస్ ఓపెనర్లు తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్-వెస్టిండీస్ రెండో మ్యాచ్ డిసెంబర్ 6న జరగనుంది.