వచ్చే టీ20 ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ తానేనని రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి భారత జట్టు కూర్పు గురించి చర్చించినట్లు తెలిపాడు. అంతేగాక ఈ సారి కప్ను అందుకోవడానికి శాయశక్తులా మరోసారి పోరాడతామని రోహిత్ చెప్పాడు. జూన్లో వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి సన్నాహకంగా అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్లో తలపడింది. 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
అయితే దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అఫ్గానిస్థాన్ సిరీస్తోనే తిరిగి టీ20 ఫార్మాట్కు రీఎంట్రీ వచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరిపై సిరీస్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. తొలి టీ20కు వ్యక్తిగత కారణంతో దూరమైన కోహ్లి రెండో టీ20ల్లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20లో షాట్కు యత్నించి డకౌటయ్యాడు. మరోవైపు హిట్ మ్యాన్ తొలి రెండు టీ20ల్లో డకౌటయ్యాడు. తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తు రనౌటవ్వగా, రెండో టీ20లో దూకుడుగా ఆడి వెనుదిరిగాడు. అయితే మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 69 బంతుల్లో అజేయంగా 121 రన్స్ చేశాడు.

అంతేగాక సూపర్ ఓవర్లోనూ రోహిత్ సత్తాచాటాడు. ఆఖరి టీ20 మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్కు దారితీసిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ స్లోర్లు కూడా సమం కావడంతో ఇరుజట్లు రెండో సారి సూపర్ ఓవర్లో తలపడ్డాయి. రెండు సూపర్ఓవర్ల్లో రోహిత్ వరుసగా 13, 11 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాను ఎంతటి విధ్వంసకర బ్యాటరో మరోసారి నిరూపించాడు.
అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. '' వచ్చే ప్రపంచకప్ను గెలవడానికి మరోసారి తీవ్రంగా ప్రయత్నిస్తాం. వరల్డ్ కప్ కోసం 15 మంది ఇంకా ఎంపిక అవ్వలేదు. కానీ ఎనిమిది నుంచి పది మంది ఆటగాళ్లు దాదాపు ఖరారు అయ్యారు. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు ఎంపిక చేయాలని చూస్తున్నాం. వెస్టిండీస్లో వికెట్ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా జట్టు కూర్పు ఉంటుంది. ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని నేను, రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నాం''
''మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఎందుకు ఎంపిక అయ్యారు? ఎందుకు ఎంపిక అవ్వలేదు? అనే విషయాలను ఆటగాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. అయితే మనం ఎవర్నీ సంతోషంగా ఉంచలేం. ఈ విషయాన్ని కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేర్చుకున్నా. జట్టు ఎంపికైన 15 మంది హ్యాపీగా ఉంటారనుకుంటాం. కానీ ఆ తర్వాత 11 మంది మాత్రమే ఆనందంగా ఉంటారు. బెంచ్కు పరిమితమైన మిగిలిన నలుగురు హ్యాపీగా ఉండరు. ఎందుకు ఎంపిక కాలేదని అడుగుతారు. హ్యాపీగా ఎవర్నీ ఉంచలేమని, జట్టును గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని తెలుసుకున్నా'' అని రోహిత్ అన్నాడు.
మూడో టీ20లో విరాట్ కోహ్లి డకౌట్పై స్పందిస్తూ.. కోహ్లి గొప్ప ప్లేయర్ అని, తొలి బంతి నుంచి బౌండరీ సాధించే ప్రయత్నంలో ఔటయ్యాడని తెలిపాడు. అయితే రోహిత్ అఫ్గాన్ స్పిన్నర్ సలీమ్ బౌలింగ్లో స్టాన్స్ మార్చుకుని ఎడమచేతి వాటం బ్యాటర్గా మారి బౌండరీ బాదడం ఇన్నింగ్స్కు హైలైట్గా నిలిచింది. దీనిపై స్పందిస్తూ.. 'రివర్స్ స్వీప్ షాట్ల, స్విచ్ షాట్లను గత రెండేళ్లుగా ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు స్పిన్లో దాన్ని ట్రై చేశాను. టీ20ల్లో బ్యాటర్కు ఇలాంటి ఆప్షన్లు కావాలి' అని వివరించాడు.