హైదరాబాద్: తొలి టీ20లో ఓటమికి జట్టంతా పూర్తిగా విఫలం కావడమేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా బుధవారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తొలి టీ 20లో ఘోర పరాజయం పట్ల న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో తన ప్రదర్శన ఆశించినంత స్ధాయిలో లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇక కోహ్లీసేన అన్ని విభాగాల్లో రాణించిందని ప్రశంసించాడు.

'మా ఆట తీరు పూర్తిగా నిరాశపరిచింది. మైదానంలో చాలా పేలవమైన ఆటను కనబరిచాం. మమ్మల్ని క్షమించుకోవడానికి అర్హత లేని ప్రదర్శన చేశాం. మొత్తంగా స్పిన్నర్లు కొంతవరకూ ఆకట్టుకుంటే, మా బౌలర్లు విఫలమయ్యారు. మేము ఓడిపోవడానికి మా చెత్త బౌలింగ్ ముఖ్యం కారణం' అని విలియమ్సన్ అన్నాడు.
'అదే క్రమంలో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది. మాకు ఏ ఒక్క ఛాన్స్ వారు ఇవ్వలేదు. మేము ఆకట్టుకునే ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మిగతా మ్యాచ్ ల్లో సమష్టిగా పోరాడతాం'అని విలియమ్సన్ తెలిపాడు. ఇక, ఢిల్లీ టీ20తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పిలికిన నెహ్రాకు విలియమ్సన్ అభినందనలు తెలియజేశాడు.
'నెహ్రాతో కలిసి చాలా మ్యాచ్ లు ఆడాను. అతనొక జెంటిల్మెన్ క్రికెటర్. మైదానం బయట, మైదానంలోపల నెహ్రా ఎప్పుడూ హుందాగా ఉంటాడు' అని కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాజ్కోట్ వేదికగా శనివారం జరగనుంది.