Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకూ బోణీ చేయలేదు. ఆడిన రెండింట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ఈ వరుస ఓటములు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. రెండు మ్యాచ్లల్లోనూ పరాజయాలను చవి చూడటం ఆ జట్టు కాన్ఫిడెంట్ను దెబ్బ తీసినట్టయింది.
తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై, రెండో గేమ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై పోరాడి ఓడింది ముంబై. గెలుపు అంచుల వరకూ వెళ్లింది. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ప్రత్యేకించి- సన్రైజర్స్ హైదరాబాద్పై జరిగిన మ్యాచ్.. ముంబై ఇండియన్స్ పోరాట స్ఫూర్తికి అద్దం పట్టింది.

సన్ రైజర్స్ నిర్దేశించిన 277 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ మాత్రం వెన్ను చూపలేదు. జట్టు స్కోరును 246 పరుగుల వరకూ తీసుకెళ్లింది. ఒక దశలో గెలిచే స్థితిలో కనిపించింది కూడా. ఈ ఓటముల దెబ్బకు కేప్టెన్ హార్దిక్ పాండ్యా మీమర్స్, హేటర్స్కు టార్గెట్ అయ్యాడు. విచ్చలవిడిగా అతన్ని ట్రోల్ చేశారు మీమర్స్.
రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కేప్టెన్సీని అప్పగించడమే దీనికి కారణమని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రోహిత్ శర్మను అభిమానించే వాళ్లంతా పాండ్యాను ట్రోల్ చేయడం ద్వారా తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. అక్కడితో ఆగలేదు. చివరికి పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్పైనా మీమ్స్ పెట్టడం, ఆమెపై కామెంట్స్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడాన్ని తప్పు పట్టాడు. క్రీడాకారులను గౌరవించాలని విజ్ఞప్తి చేశాడు. అంతర్జాతీయ వేదికలపై భారత్ను, ప్రజలను తలెత్తుకునేలా చేయగలిగేది వారేనని పేర్కొన్నాడు. ప్రపంచ దేశాల్లో గర్వపడేలా చేస్తారని ప్రశంసించాడు. ఒకరోజు వారిని పొగడ్తల్లో ముంచెత్తడం, మరో రోజు కించపర్చేలా వ్యవహరించడం సరికాదని సోనూ సూద్ పేర్కొన్నాడు.
అలా చేయడం వల్ల తాము ఓడిపోయినట్టు గుర్తించాలని హితవు పలికాడు. క్రికెట్ను తాను ఎంతగా ప్రేమిస్తానో.. ఈ దేశం తరఫున ఆడే ప్రతి ప్లేయర్ను అంతే ఆరాధిస్తానని సోనూ చెప్పాడు. ఫలానా క్రికెటర్ ఏ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు? కేప్టెన్గా ఉన్నాడా? 15వ ప్లేయర్గా ఉన్నాడా? అనేది చూడనని దేశం తరఫున ఆడే ప్రతి ప్లేయర్ కూడా తనకు ఆరాధ్యుడేనని వ్యాఖ్యానించాడు.