ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్లో ఓడి ఇంటి ముఖం పట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్.. ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. హడావుడి గందరగోళ షెడ్యూల్ కారణంగానే సెమీస్ కోసం సన్నద్ధం అయ్యేందుకు తమ జట్టుకు తగినంత సమయం దొరకలేది ఆరోపించాడు.
"గంటా 40 నిమిషాల విమాన ప్రయాణమే చేశాం. కానీ, వాస్తవం ఏంటంటే మేం అలా జర్నీ చేయడం కరెక్ట్ కాదు. మ్యాచ్ ముగియగానే తెల్లవారుఝామున లేచి బయలుదేరాం. ముందుగా దుబాయ్ లో మ్యాచ్ కోసం సాయంత్రం 4 గంటలకు వచ్చాం. భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ పూర్తవ్వగానే తర్వాత రోజే ఉదయం 7.30 గంటలకు మళ్లీ పాకిస్థాన్ కు బయలుదేరాం. అసలు అది సరైంది కాదు. ఐదు గంటలు పాటు జర్నీ చేశాం. దీంతో మాకు సెట్ అవ్వడానికి సరైన సమయం దొరకలేదు." అని మిల్లర్ అన్నాడు.

అసలేమైందంటే?
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లోని ఆఖరి లీగ్ మ్యాచ్ వరకు కూడా సెమీ ఫైనల్ లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందనేది స్పష్టత రాలేదు. అయితే టీమిండియా సెమీస్కు అర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్ దుబాయ్లోనే నిర్వహిస్తామని ముందుగానే షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అందుకే గ్రూప్ బీలోని నాకౌట్ జట్లు ఆసీస్, దక్షిణాఫ్రికా రెండూ దుబాయ్కు వెళ్లాయి. అయితే గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి అగ్రస్థానానికి చేరింది. దీంతో తొలి సెమీస్ కోసం ఆస్ట్రేలియా దుబాయ్ లోనే ఉండిపోగా.. దక్షిణాఫ్రికా మాత్రం రెండో సెమీస్ కోసం వెంటనే పాకిస్థాన్ కు తిరిగి రావాల్సి వచ్చింది.